ఉచిత పథకాల పేరిట భావితరాలపై భారం మోపొద్దు

ఉచిత పథకాల పేరిట భావితరాలపై భారం మోపొద్దు
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల్లో స్థిరత్వం తేవాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని తెలిపారు.
 
‘మీరు (రాజకీయ పార్టీలు) ప్రకటించే ఉచిత పథకాలను ఈనాడు సమర్ధించుకోవచ్చు. కానీ ప్రజాభిప్రాయం ప్రకారం పన్నుచెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలి. మీరు కొందరు వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేసి మరికొందరికి ఇస్తున్నారు. ఉచిత పథకాలకు అర్హులై ఉండాలి’ అని పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించిన మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఏది ఏమైనా, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నుంచి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, విద్యారంగాలకు సరిపడా నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందొచ్చు, కానీ ఇతర పన్ను చెల్లింపు దారులపై ప్రతికూల ప్రభావం ఏర్పడకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె తెలిపారు. 

నగదు బదిలీ పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఐదు హామీలతో గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంగతిని ఆమె గుర్తుచేశారు. ‘కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల్లేవని చెప్పకుండా ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలి’ అని ఆమె స్పష్టం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులపై బస్సు ప్రయాణ చార్జీలు రెట్టింపు చేయడం వల్ల కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరుగాలని ఆమె సూచించారు.

‘ఉచితాలపై మీరు నిజాయితీగా చర్చ పెట్టండి. మీరు ఇచ్చే ఉచిత పథకం ఆమోద యోగ్యం కాదని చెప్పటం అంత తేలికకాదు. నేను అమలు చేసే సంక్షేమ పథకాన్ని సమర్ధించుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టుతోపాటు వివిధ విధాన నిర్ణేతలు తరుచుగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల మధ్య తేడాలు చెప్పడం చాలా కష్టం అని చెబుతున్నారని ఆమె గుర్తు చేసారు.

కాగా, కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు అన్ని గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలకు కొనసాగింపు అని ఆమె స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ప్రతిపాదించామని, బీహార్ లో కోషి నది వరదలు సృష్టించిన విధ్వంసాన్ని ఎవరైనా కాదనగలరా? అని ఆమె ప్రశ్నించారు.
 
యువతకు ఇంటర్న్ షిప్ ద్వారా నైపుణ్యం కలిగించే పధకం పరిశ్రమలకు స్వచ్చందమే అని చెబుతూ ఈ మేరకు ప్రతిపాదనలు పరిశ్రమల నుంచే వచ్చాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఎవ్వరిని వత్తిడులకు గురిచేయమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయమై సిఐఐ, ఫిక్కీ లతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామని ఆమె తెలిపారు.