ఈనెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం సహా అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.

అసెంబ్లీ సమావేశం తొలిరోజు సమావేశం తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మినహా ఈనెల 31వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే మరొకసారి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు లాస్యనందిత మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారని గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్య  నందితను ప్రజలు కంటోన్మెంట్​ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రమాదవశాత్తు ఆమె మరణించడం బాధాకరమని సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లాస్య నందిత మృతిపట్ల బీఆర్​ఎస్​ సంతాపం తెలిపింది. సాయన్న మరణం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చిందని కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత ఆవేదన కలిగించిన అంశమని ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

లాస్య నందిత మృతి పట్ల బీజేపీ తరఫున శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి సంతాపం తెలిపారు. లాస్య నందిత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారని, లాస్య నందితకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించామని, దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు మన మధ్య నుంచి తీసుకెళ్లారని చింతించారు.  లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు.