ఈఏడు సమృద్ధిగా వర్షాలు .. పంటలు బాగా పండుతాయి

ఈఏడు సమృద్ధిగా వర్షాలు .. పంటలు బాగా పండుతాయి
 
* రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత
 
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపుగా కనువిందు చేసింది. మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. 
 
అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చికుండపై భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయని, పాడి, పంటలు సమృద్ధిగా ఉంటాయని, భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానని తెలిపారు.
 
ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడేది తానే అని చెప్పారు. తనకు ఏమిచ్చిన ఆనందంగా అందుకుంటానని పేర్కొన్నారు. పిల్లాజెల్లా, గొడ్డుగోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు. ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్లతును అమ్మవారు కోరారు.  ఔషదాలు తగ్గించుకొని పాడి పంటలపై దృష్టిపెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందని చెప్పారు. 
 
 కాగా, బోనాల జాతరలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వహకులు వెల్లడించారు.  ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం ఆదివారం  వైభవంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. ఆడపడుచులు బోనాలు, సాక సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
 
 మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నారు.