లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’

లండన్‌ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’
భారతదేశ చరిత్రలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుకు ప్రత్యేక స్థానముంది. ఆయనకు సంబంధించిన కథలు, గాథాలు అనేకం ప్రజా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే మొగల్ సామ్రాజ్యంలో జనరల్‌గా పని చేసిన అఫ్జల్‌ఖాన్‌ను ఛత్రపతి శివాజీ వాఘ్ నఖా (పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం)తో అంతమొందించారు. 
 
జులై 19వ తేదీ నుంచి ఈ వాఘ్ నఖాను మహారాష్ట్రలోని సతారా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. అందుకోసం ఈ ఆయుధాన్ని లండన్‌లోని విక్టోరియా, అల్బర్ట్ మ్యూజియం నుంచి భారత్‌కు తీసుకు వచ్చారు.  మరోవైపు ఆ మరాఠా యోధుడు ఉపయోగించిన ఈ ఆయుధాన్ని ప్రదర్శన కోసం సతారా మ్యూజియాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు చేస్తుంది. 
 
ఈ ప్రదర్శనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం ప్రారంభిస్తారని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటి‌వార్ వెల్లడించారు. మూడేళ్ల పాటు సతారా మ్యూజియంలో వాఘ్ నఖాను ప్రజల సందర్శనార్థం మ్యూజియంలో ఉంచుతామని ఆయన వివరించారు. 1659లో సతార యుద్ధంలో వ్యాఘ్‌ నఖ్‌ అయుధంతోనే బీజాపూర్‌ సుల్తాన్‌ అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ మట్టుబెట్టారు. వ్యాఘ్‌ నఖ్‌ను మహారాష్ట్రకు తీసుకురావడానికి రూ. 14.08 లక్షలు మాత్రమే వ్యయం చేసినట్టు సుధీర్‌ చెప్పారు.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పట్టాభిషేకం జరిగి 360 ఏళ్లు అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులోభాగంగా లండన్‌ మ్యూజియంలోని శివాజీ వాఘ్ నఖాను భారత్‌కు తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. 

అందుకోసం గతేడాదిలో లండన్‌లోని విక్టోరియా, అల్బర్ట్ మ్యూజియం అధికారులతో సంప్రదింపులు జరిపామని, ఆ క్రమంలో మ్యూజియం అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. అలా.. శివాజీ మహారాజు ఉపయోగించిన వాఘ్ నఖా భారత్‌కు వచ్చిందని తెలిపారు. 

ఈ నేపథ్యంలో జులై 19వ తేదీ నుంచి ప్రజల కోసం సతారా మ్యూజియంలో వాఘ్ నఖాను ఉంచుతామని ఆయన వెల్లడించారు. అయితే వాఘ్‌ నఖాను ప్రతి జిల్లాలో ప్రజల సందర్శన కోసం ఉంచడం కుదరదని తెలిపారు. దీంతో ఈ వాఘ్‌ నఖాను ఒక ప్రదేశంలో ఉంచితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీనిని చూసేందుకు వస్తారన్నారు.

ఇంకోవైపు వాఘ్ నఖాను సతారాలోనే ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణముందని చెప్పారు. 1659లో సతారాలోని ప్రతాప్‌గఢ్ కోట వద్ద బిజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్‌ను ఛత్రపతి శివాజీ వాఘ్ నఖాతో చంపారని, అయితే అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించడం అంత మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇవి విశ్వాసానికి ప్రతీక అని మంత్రి సుధీర్ అభివర్ణించారు. అదీకాక ప్రతాప్‌గఢ్ కోట శివాజీ ధైర్య సాహసాలకు ప్రతీక అని చెప్పారు. దీంతో ఈ వాఘ్ నఖా ప్రదర్శనకు సతారా మ్యూజియంను ఏంచుకున్నామని మంత్రి సుధీర్ వివరించారు.