2047 నాటికి అందరికీ బీమా

2047 నాటికి అందరికీ బీమా
బీమా చట్టం, 1938ని సవరించడం కోసం ఓ బిల్లును రానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నది. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని సవరించబోతున్నట్లు తెలుస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాలసీదారుల ప్రయోజనాలతోపాటు సులువుగా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించే విధంగా ఈ సవరణ ఉండబోతున్నట్లు సమాచారం. 
 
కాంపోజిట్‌ లైసెన్స్‌, సాల్వెన్సీ నిబంధనల తగ్గింపు, క్యాప్టివ్‌ లైసెన్స్‌ జారీ, ఇంటర్మీడియరీలకు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌, ఇతర ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌ పంపిణీకి ఇన్సూరర్లకు అనుమతి ఇవ్వడం వంటి నిబంధనలు ఈ బిల్లులో ఉంటాయి. దీనివల్ల బ్యాంకింగ్‌ రంగంలో మాదిరిగానే బీమా రంగంలోకి కూడా ప్రత్యేకత గల బీమా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది.
 
బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుత వర్గీకరణ ప్రకారం, యూనివర్సల్‌ బ్యాంక్‌, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌ ఉన్న సంగతి తెలిసిందే. కాంపోజిట్‌ లైసెన్స్‌ ఇవ్వడం వల్ల లైఫ్‌ ఇన్సూరర్లు జీవిత బీమా లేదా సాధారణ బీమా పాలసీలను మూల్యాంకనం చేసి, ప్రీమియం రేట్లను నిర్ణయించడానికి వీలవుతుంది. 
 
1938నాటి చట్టం ప్రకారం లైఫ్‌ ఇన్సూరర్లు కేవలం జీవిత బీమాను, జనరల్‌ ఇన్సూరర్లు కేవలం ఆరోగ్య, మోటార్‌, అగ్ని ప్రమాద, మెరైన్‌ వంటి నాన్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌లను మాత్రమే ఇవ్వడానికి వీలవుతున్నది. అంటే ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీ జీవిత బీమా ప్రొడక్ట్‌లను, నాన్‌ లైఫ్‌ బీమా ప్రొడక్ట్‌లను ఏక మొత్తంగా ఇవ్వడానికి వీలుకాదు. 
 
ఈ పరిస్థితిని నివారించి, అందరికీ బీమాను అందజేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు తుది ముసాయిదా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. దీనిని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం కోసం పంపిస్తారు.