
దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1.28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత సమయానికి తలుపులు తెరుచుకున్నాయి. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
46 ఏళ్ల కిందట 1978 లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్లీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియ చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు.
ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు. తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ఏఎస్ఐ సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు.
వీళ్లతోపాటు నలుగురు ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు ‘ఆజ్ఞ’ పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని వేరేచోటుకు తరలించనున్నారు. మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరేచోట భద్రపర్చనున్నారు.
“భగవంతుడు జగన్నాథుని కోరిక మేరకు, ఒడియా సంఘం, ‘ఒడియా అస్మిత’ గుర్తింపుతో, ముందుకు సాగడానికి ప్రయత్నాలు ప్రారంభించింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. “మీ కోరిక మేరకు జగన్నాథ ఆలయాల నాలుగు ద్వారాలు ముందుగా తెరిచారు. ఈరోజు మీ కోరిక మేరకు 46 ఏళ్ల తర్వాత గొప్ప ప్రయోజనం కోసం రత్న భండారం తెరవబడింది” అని మధ్యాహ్నం 1.28 గంటలకు షేర్ చేసిన పోస్ట్లో పేర్కొంది.
ఈ పూరీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు.
దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. 1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచిన సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితోపాటు వజ్రాలనూ గుర్తించారు. వీటన్నింటిని లెక్కించి ఓ జాబితా రూపొందించారు.
ఇక ఆ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. ఆ రహస్య గదిలో పూరీ జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వ కాలంలో ప్రతీ 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన