ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్‌ యాదవ్‌

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా వివేక్‌ యాదవ్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా వివేక్‌ యాదవ్‌ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు ఉత్తర్వుల్ని పంపించారు. వివేక్‌ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు.  వివేక్‌యాదవ్‌ బాధ్యతలు తీసుకోగానే ఇప్పటివరకు సీఈవోగా ఉన్న ముఖేష్‌కుమార్‌ మీనా రిలీవ్‌ అవుతారు.
మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటుని భావిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవోగా)గా ఉన్నారు.  మూడేళ్ల క్రితం ఈ పోస్టులోకి రాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం మీనా నేతృత్వంలోనే పూర్తయ్యింది. రాష్ట్రంలో 81.66 శాతం ఓటింగ్‌ నమోదు కావడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాజాగా ముఖేష్ కుమార్‌ రిలీవ్‌కు సంబంధించి సంకేతాలు వచ్చాయి. 
 
కొత్త సీఈవో నియామకానికి ఎన్నికల సంఘానికి ముగ్గురి పేర్లు పంపించగా రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు మీనాను ఈసీ రిలీవ్‌ చేయడంతో పాటు కొత్త ఎన్నికల అధికారి నియమానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.‌ మొన్నటి వరకు వివేక్ యాదవ్ సీఆర్డీఏ కమిషనర్‌‌గా ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన్ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇంతలోనే సీఈవోగా నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. 

ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టుగా మార్పు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ‘డాక్టర్‌ నందమూరి తారక రామారావు వైద్య సేవ’ పేరును మార్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు.

 
గతంలో ఇదే పేరు ఉంటే వైసిపి అధికారంలోకి వచ్చాక ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ అని పేరు మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌‌తో భేటీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సీజేను చంద్రబాబు కలవడం ఇదే మొదటిసారి.