ఉప ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఇండియా కూటమి

ఉప ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఇండియా కూటమి
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే ఎన్నికలు జరగ్గా, వాటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం కొనసాగుతోంది. కాగా ఈ 13 సీట్లల్లో ఇండియా కూటమి ఇప్పటికే రెండు స్థానాల్లో విజయం సాధించి, మరో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఉత్తరాఖండ్​లో రెండు స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్​లలో ఒక్కో స్థానంలో కాంగ్రెస్  ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్​ను బరిలోకి దింపిన డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ ఇప్పటికే గెలిచింది. కమలేష్ ఠాకూర్ తన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్​పై 9వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

మరోవైపు హమీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పుష్పిందర్ వర్మపై బిజెపి అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. పంజాబ్​లోని జలంధర్ వెస్ట్ నుంచి మోహిందర్ భగత్​ను బరిలోకి దింపి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్ పై 37 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించింది.

పశ్చిమ్​ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ప్రత్యర్థులపై ముందంజలో ఉందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గణాంకాలు చెబుతున్నాయి. మణిక్తాలా, బాగ్దా, రాణాఘాట్ దక్షిణ్, రాయ్​గంజ్ అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరిగాయి.  రాయ్‌గంజ్ అభ్యర్థి కృష్ణ కళ్యాణి ఏడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత 50,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.

తమిళనాడులోని విక్రావండి అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే నేత అన్నియూర్ శివ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతి 4,000 ఓట్ల ఆధిక్యం సాధించారు.

బీహార్ లోని రూపౌలి స్థానంలో బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) ఆధిక్యంలో ఉంది. మార్చ్​లో జనతాదళ్ (యునైటెడ్)కు రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరిన బీమా భారతి పార్లమెంట్​ సీటు నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అయితే ఆమె స్వతంత్ర అభ్యర్థి రాజేష్ రంజన్ చేతిలో ఓడిపోయారు.