ఐఎస్‌ఎస్‌కు దీటుగా దేశీ స్పేస్‌ స్టేషన్‌

ఐఎస్‌ఎస్‌కు దీటుగా దేశీ స్పేస్‌ స్టేషన్‌
అంతరిక్ష వ్యోమగాములు సేదతీరడానికి, పరిశోధనలు నిర్వహించడానికి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌) సేవలు అందిస్తున్నది. అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. అయితే, వినువీధుల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న భారత్‌కు ఇప్పటికీ సొంతంగా స్పేస్‌స్టేషన్‌ లేదు. 
 
భారతీయ అంతరిక్ష స్టేషన్‌ (బీఏఎస్‌) పేరిట ఇస్రో ఓ స్పేస్‌స్టేషన్‌ను నిర్మించాలనుకొన్నప్పటికీ అది అందుబాటులోకి రావడానికి 2035 వరకూ వేచిచూడాలని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ఇలాంటి సమయంలో బెంగళూరుకు చెందిన ఆకాశలబ్ధి అనే స్టార్టప్‌ కంపెనీ స్పేస్‌స్టేషన్‌ నిర్మాణానికి సిద్ధమైంది.

2027నాటికి ఈ స్పేస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధంచేసినట్టు కంపెనీ సీఈవో సిద్ధార్థ్‌ జేనా తెలిపారు. ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో జట్టుకట్టనున్నట్టు తెలిపారు. తమ స్పేస్‌స్టేషన్‌లో ఏకకాలంలో 6-16 మంది ఉండొచ్చని చెప్పారు. 

అంతరిక్షంలోని గ్రహ శకలాలు, రేడియేషన్‌ నుంచి రక్షించే అన్నిరకాల ఏర్పాట్లు ఐఎస్‌ఎస్‌కు దీటుగా తమ స్పేస్‌స్టేషన్‌లో ఉంటాయని పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌తో పోలిస్తే తమ స్టేషన్‌ ఎంతో చవకైనదని వెల్లడించారు. 2030లో ఐఎస్‌ఎస్‌ జీవితకాలం ముగియనున్నది. దీన్ని కూల్చేసే కాంట్రాక్ట్‌ను కూడా నాసా  స్పేస్‌ఎక్స్‌కు ఇవ్వడం గమనార్హం.

రోదసి ప్రయోగాలు ఊపందుకొన్న నేపథ్యంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి, రోదసి యాత్రికులు సేదతీరడానికి ఆకాశలబ్ధి సంస్థ ‘ఎక్స్‌పాండబుల్‌ స్పేస్‌ హ్యాబిటేట్‌’ (ఎక్స్‌ఎస్‌హెచ్‌) పేరిట ఓ స్పేస్‌స్టేషన్‌ను నిర్మించనున్నది. 2023 నవంబర్‌లోనే దీనికి సంబంధించిన ప్రొటోటైప్‌ ‘అంతరిక్ష హబ్‌’ డిజైన్‌ను ఐఐటీ-రూర్కీ, ఐఐఎస్‌-బెంగళూరులో సిద్ధంచేసింది.