ఫిలిప్పీన్స్‌ సమీపంలో చైనా ‘రాకాసి’ యుద్ధనౌక

ఫిలిప్పీన్స్‌ సమీపంలో చైనా ‘రాకాసి’ యుద్ధనౌక
చైనా, ఫిలిప్పీన్స్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత నెల వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని సెకండ్‌ థామస్‌ షోల్‌ సమీపంలో చైనా, ఫిలిప్పీన్స్‌ జవాన్ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్‌ ప్రత్యేక ఆర్థిక జోన్‌(ఈఈజెడ్‌) సమీపంలో చైనా తన ‘రాకాసి యుద్ధనౌక’ను మోహరించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. 
 
ఈ నౌక మోహరింపు ఈ నెల 6న జరిగింది. అది మనీలాకు 200 నాటికన్‌ మైళ్ల దూరంలోని ఈఈజెడ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌ గార్డు(పీసీజీ) కూడా అప్రమత్తమైంది.  165 మీటర్ల పొడవు, సాధారణ పెట్రోలింగ్‌ నౌకల కంటే 3-4 రెట్ల అతిపెద్ద పరిణామంలో ఉండే సీసీజీ-5901అనే అసాధారణమైన కోస్ట్‌ గార్డ్‌ నౌకను చైనా స్పార్ట్లీ ద్వీపం సమీపంలోని సబీనా షోల్‌ సమీపంలో మోహరించిందని అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ పేర్కొన్నది. 
 
ఈ నౌక పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఏరియాతోపాటు దాని పరిమాణం కూడా అసాధారణంగా ఉన్నది. పొరుగు దేశమైన ఫిలిప్పీన్స్‌ను బెదిరించేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని పలువురు భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధానికి కూడా చైనా కాలు దువ్వుతున్నదని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. కాగా, తాజా పరిణామంపై ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌ గార్డు అధికార ప్రతినిధి జే తర్రియెలా మాట్లాడుతూ తమ దేశ ఈఈజెడ్‌లో ఉండటంపై చైనా నౌకకు హెచ్చరిలకు చేశామని తెలిపారు.