హాథ్రస్ తొక్కిసలాటలో సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులు

హాథ్రస్ తొక్కిసలాటలో సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులు

* కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేం!

ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాటకు నిర్వాహకులే బాధ్యులని సిట్ నివేదిక తేల్చింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం దాగిలేదనే విషయాన్ని తోసిపుచ్చలేమని సిట్ తెలిపింది. ఈ మేరకు యూపీ సర్కార్కు హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్థానిక ఎస్డీఎం, సర్కిల్ ఆఫీసర్ సహా మరో నలుగురు అధికారులను యూపీ సర్కార్ సస్పెండ్ చేసింది.

 అలాగే సిట్ తన నివేదికలో స్థానిక అధికార యంత్రాంగం వైఫల్యాలను వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తొక్కిసలాటకు హాథ్రస్ తొక్కిసలాటకు సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులని పేర్కొంది. వారు సత్సంగ్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయలేదని తెలిపింది.

“స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం సత్సంగ్ నిర్వహణను సీరియస్గా తీసుకోలేదు. సీనియర్ అధికారులకు సరైన సమాచారం అందించడంలో వారు విఫలమయ్యారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు అవసరం. సత్సంగ్ నిర్వహకులు, పోలీసులు, స్థానిక అధికారుల వైఫల్యం వల్ల తొక్కిసలాట జరిగింది” అని నివేదిక తెలిపింది. 

“స్థానిక ఎస్డీఎం, సర్కిల్ ఆఫీసర్, తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్, అవుట్‌ పోస్టు ఇన్‌ఛార్జ్‌ లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. ఎస్డీఎం సికందర్ రావు వేదికను పరిశీలించకుండానే సత్సంగ్కు అనుమతి ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు” అని వెల్లడించారు. 

“నిర్వాహకులు ఎక్కువ మంది భక్తులను సత్సంగ్కు ఆహ్వానించారు. కానీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదు. ఆశ్రమం ఆర్గనైజింగ్ కమిటీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. కార్యక్రమ వేదికను తనిఖీ చేయకుండా స్థానిక పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. భోలే బాబా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండానే జన సమూహాన్ని సత్సంగ్లో కలిశారు” అంటూ నివేదిక వివరించింది. 

భారీగా జనం వచ్చినా ఎటువంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, తొక్కిసలాట సమయంలో సత్సంగ్ నిర్వహక కమిటీ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారని సిట్ నివేదిక వివరించింది.  హాథ్రస్ తొక్కిసలాట జరిగిన వెంటనే అడిషినల్ డీజీపీ అనుపమ్ కులశ్రేష్ఠ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 

జులై 2,3,5 తేదీల్లో సిట్ బృందం ఘటనాస్థలికి పరిశీలించింది. ఈ దర్యాప్తులో పోలీసులు, అధికారులు, ప్రత్యక్ష సాక్షులు సహా 125 మంది వాంగ్మూలాలను తీసుకుంది సిట్. అంతేకాకుండా ఘటనకు సంబంధించి ప్రచురించిన వార్తల కాపీలు, ఆన్-సైట్ వీడియోగ్రఫీ, ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌ లను పరిశీలించింది.

మరోవంక, హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిల్ను లిస్టింగ్ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తొక్కిసలాట ఘటనపై న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తాను జులై 8నే పిల్ ను లిస్టింగ్ కు ఆదేశించినట్లు, త్వరలోనే విచారణ చేపడతామని తెలిపారు.