వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది

వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించింది

రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. గుడులు కూల్చడంతోపాటు రథాలను కూడా కాల్చారని, ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని ఆమె మండిపడ్డారు. 

సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో  బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ గతంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ చీకటి పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని ఆమె ధ్వజమెత్తారు. అదేవిధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను కూడా ప్రజలు మరిచిపోరని ఆమె స్పష్టం చేశారు.  

తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చేస్తున్న ప్రకటనలపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘గతంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఇంచుమించు అలాంటి ఎమర్జెన్సీ వాతావరణమే నడిచింది. ఎవరు గళం విప్పినా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు” అంటూ ఆమె మండిపడ్డారు.

“రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి సన్నగిల్లిందేమో. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారం చేపట్టాక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అంతర్వేది రథం కాల్చివేత, పిఠాపురంలో ఆలయ విధ్వంసం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇవన్నీ విధ్వంసం కాదా?’’ అని పురందేశ్వరి ప్రశ్నించారు.

వికసిత్ భారత్, ఆత్మ నిర్భర కు ప్రజలు ఓటు వేసి ఎన్డీఏ కూటమికి కేంద్రం, రాష్ట్రంలో అద్భుత విజయం అందించారని పురందేశ్వరి తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించిందని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 5వ స్థానానికి తీసుకు వచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. 
 
గత ఐదేళ్లలో సుమారు 15 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు అందించామని, లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని ఆమె చెప్పారు.  ఈ ఎన్నికల్లో బీజేపీకి 24 కోట్ల ఓట్లు వచ్చాయని, గతంలో కంటే ఓట్లు పెరిగాయని, మన బలం పెరిగిందని ఆమె తెలిపారు. అయితే, ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల మనకు సీట్లు తగ్గాయని ఆమె పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానిస్తే, మోదీ రాజ్యాంగానికి నమస్కరించారని పురందేశ్వరి గుర్తు చేశారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ అవమానిస్తే, వాజ్పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించిందని పురందేశ్వరి ఆమె చెప్పారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని పురందేశ్వరి తెలిపారు. 
 
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించిందని, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రజలు ఓటు వేశారని ఆమె చెప్పారు. ఎన్డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని చెబుతూ లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామన్న పురందేశ్వరి, ఐదో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి చారిత్రక విజయం సాధించిందని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, రాష్ట్రానికి అందించిన వివిధ ప్రాజెక్టులను వివరించారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఆలోచనలని, మూడోసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని మురగన్‌ గుర్తు చేశారు. 

రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లను జమచేస్తూ రెండో సంతకం చేశారని మురగన్‌ తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సుజనాచౌదరి, ఈశ్వరరావు, పార్థసారధి హాజరయ్యారు.