
ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రక్రియ సాగింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్రం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ కేంద్రం తన వాటాలను ఉపసంహరిస్తుందా? అందుకు చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
‘కేంద్ర బడ్జెట్ 2024-25కు ముందుమాట’ అనే పేరుతో నివేదిక విడుదల చేసిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణకు ఇదే సరైన సమయం అని పేర్కొంది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీ కలిసి 61 శాతం వాటా విక్రయిస్తున్న సంగతిని ఎస్బీఐ తన నివేదికలో గుర్తు చేసింది.
ఐడీబీఐ బ్యాంకులో కేంద్రానికి 45 శాతానికి పైగా, ఎల్ఐసీకి 49.24 శాతం వాటాలు ఉన్నాయి. 2022 అక్టోబర్లో ఐడీబీఐలో వాటాల విక్రయానికి బిడ్లు ఆహ్వానించిన దీపమ్.. గతేడాది జనవరిలో ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుంచి బిడ్లు స్వీకరించిందని, దీనిపై ఈ నెల 22న కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఉంటే పౌరుల పొదుపుతోపాటు డిపాజిట్లు పెరుగుతాయని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై మాదిరిగానే బ్యాంకుల్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ మీద పన్ను విధానం ఉండాలని అభిప్రాయ పడింది. 2022-23లో జీడీపీలో పౌరుల నికర ఆర్థిక పొదుపు 5.3 శాతానికి తగ్గిందని, గత ఆర్థిక సంవత్సరం 5.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
దివాళా ప్రక్రియలో సమూల మార్పులు తేవాలని ఎస్బీఐ పేర్కొంది. ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ (ఐబీసీ) ద్వారా 32 శాతం మాత్రమే రుణాల రికవరీ ఉంటుందని, దీనివల్ల బ్యాంకులు 68 శాతం నష్టపోతున్నాయని వివరించింది. అయితే, ఈ నివేదిక తమ బ్యాంక్ రీసెర్చ్ టీం నివేదిక మాత్రమేనని, తమ బ్యాంకు అధికారిక నివేదికగా పరిగణించవద్దని అభిప్రాయ పడింది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా