పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా బంకర్లు!

పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా బంకర్లు!
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్‌ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనా సైన్యం అక్కడ ఆయుధాలు, ఇంధనాన్ని నిల్వ చేసుకొనేందుకు అండర్‌ గ్రౌండ్‌ బంకర్లు, సాయుధ వాహనాలకు రక్షణ కల్పించేలా పార్కింగ్‌ నిర్మాణాలు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ శాటిలైట్‌ చిత్రాల్లో వెల్లడైంది. తూర్పు లద్దాక్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద భారీ బంకర్లు నిర్మించేందుకు చైనా సైన్యం చాలా లోతుగా తవ్వుతున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆయుధాలు, ఇంధనం నిల్వచేయడంతోపాటు, సాయుధ వాహనాలకు పటిష్ఠమైన షెల్టర్లుగానూ వీటిని ఉపయోగించుకోనున్నట్టు భావిస్తున్నారు. 

పాంగాంగ్‌ సరస్సు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జాప్‌ ప్రాంతంలో చైనా సైన్యం పీఎల్‌ఏ(ది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ) ప్రధాన స్థావరం ఉంది. పాంగాంగ్‌ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్‌ సైన్యానికి అదే ప్రధాన కార్యాలయం. దానిని వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అది భారతదేశ భూభాగమని భారత్‌ వాదిస్తోంది. 

2020 మేలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ముందు ఇక్కడ ఎటువంటి మానవ ఆవాసాలూ లేవు. 2021-22 మధ్యలోనే సిర్జా్‌పలోని స్థావరాన్ని డ్రాగన్‌ సైన్యం నిర్మించింది.  అక్కడ ఆయుధాలు, ఇంధనం, ఇతర సామగ్రి నిల్వ చేసుకునేందుకు భూగర్భ బంకర్లు నిర్మిస్తున్న విషయాన్ని అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. తమ ఉపగ్రహాల ద్వారా రోజుకు 15 సార్లు ఫొటోలు తీయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉంది. 

మే 30వ తేదీన తీసిన ఫొటోలో 8 ఏటవాలు మార్గాలు ఉన్న భారీ భూగర్భ బంకర్‌ వెలుగులోకి వచ్చింది. దానికి సమీపంలోనే 5 ప్రవేశమార్గాలున్న మరో చిన్న బంకర్‌ కూడా ఉంది. ఇక్కడి ప్రధాన స్థావరం కోసం అనేక భారీ భవనాలు నిర్మించడంతోపాటు, సాయుధ వాహనాల పార్కింగ్‌కు పటిష్ఠమైన షెల్టర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

కాగా, సరిహద్దులో పరిస్థితిపై ప్రభుత్వం దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలనే కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పునరుద్ఘాటించారు. పాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా తవ్వకాలపై మీడియా కథనాన్ని ఖర్గే ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 2020 మే వరకు భారత ఆధీనంలో ఉన్న భూభాగంలో చైనా ఎలా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని ఖర్గే ప్రశ్నించారు.   తాజా శాటిలైట్‌ చిత్రాలపై భారత సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.