అట్టహాసంగా టీమిండియా విక్టరీ పరేడ్

టీ20 విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు విజయోత్సవ యాత్ర ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్లుగా నిలిచిన భారత ఆటగాళ్లు, కోచ్‍లు ఓపెన్ టాప్ బస్‍పై గురువారం సాయంత్రం విక్టరీ పరేడ్ నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను అభిమానులకు చూపిస్తూ ప్లేయర్లు ముందుకు సాగారు. 
ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగింది. అశేష‌మైన అభిమానులు దారిపొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ… ‘జ‌య‌హో టీమిండియా’ నినాదాల‌తో భార‌త క్రికెటర్ల మీద‌ అభినంద‌ల వ‌ర్షం కురిపించారు. మువ్వ‌న్నెల జెండాలు చేత‌బూని ‘ఈ విజ‌యం చారాత్రాత్మ‌కం’ అంటూ రోహిత్ సేన ఘ‌న‌త‌ను కీర్తించారు.
 
17 ఏళ్ల తర్వాత టీమిండియాకు టీ20 టైటిల్ దక్కడంతో అత్యంత సంతోషంగా సంబరాలు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా సహా టీమిండియా ఆటగాళ్లు, హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దారిపొడవునా అభిమానులకు అభివాదాలు చేశారు. ముంబై సముద్ర తీరం నారిమన్ పాయింట్ వద్ద మొదలైన ఈ విక్టరీ పెరేడ్‍కు వేలాది మంది భారత అభిమానులు హాజరయ్యారు.

టీమిండియా టి20 ప్రపంచ కప్ విక్టరీ పరేడ్‍కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇండియా.. ఇండియా, రోహిత్.. రోహిత్, కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలతో మోతెక్కించారు. హార్దిక్ పాండ్యా, జస్‍ప్రీత్ బుమ్రా సహా మరికొందరు ఆటగాళ్ల పేర్లను అరుస్తూ ప్రశంసించారు. వేలాదిగా అభిమానులు రావడంతో ఈ పరేడ్ చాలా సేపు సాగింది.

ఇసుకేస్తే రాల‌నంత‌ మంది జ‌నంతో టీమిండియా విజ‌యోత్స‌వ ర్యాలీ వాంఖ‌డే స్టేడియం వైపు వెళ్ళింది. దారికిరువైపులా సైన్యంలా నిల‌బ‌డిన ఫ్యాన్స్ క్రికెట‌ర్లను కెమెరాలో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఫ్యాన్స్ మురిసిపోయారు. ముంబై పోలీసుల భారీ భ‌ద్ర‌త న‌డుమ ర్యాలీ ప్ర‌శాంతంగా సాగింది.

ముంబై సాగర తీరం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకులు ఆనందంతో హర్షధ్వానాల మోత మోగించారు. కాస్త ఆలస్యంగా ఈ పరేడ్ మొదలైనా అభిమానుల్లో మాత్రం జోష్ ఏ మాత్రం తగ్గలేదు. రహదారులన్నీ అభిమానులతో నిండిపోయాయి. వాంఖడే స్టేడియం వరకు ఈ విక్టరీ పరేడ్ అట్టహాసంగా జరిగింది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను ఎత్తారు. వెనుక నిలబడిన రోహిత్‍ను ముందుకు పిలిచాడు విరాట్. ఆ తర్వాత ఇద్దరూ టైటిల్ చేతిలో పట్టుకొని అభిమానులను చూపించారు. గట్టిగా అరిస్తూ సంబరం చేసుకున్నారు. విక్టరీ పరేడ్‍కు ఇది ఓ హైలైట్‍గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

వెస్టిండీస్ నుంచి టీమిండియా నేటి ఉదయమే ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారత ఆటగాళ్లు కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకు విమానంలో వచ్చాయి. అయితే, విమానం ఆలస్యమవడం, వర్షం పడటంతో విక్టరీ పరేట్ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయినా అభిమానులు కోలాహలం ఏ మాత్రం తగ్గలేదు. విశ్వవిజేతలుగా నిలిచిన ఆటగాళ్లకు జయజయధ్వానాలు పలికారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రహదారి మొత్తం జనాలతో నిండిపోయింది. ప్రత్యేక కార్యక్రమాలు జరిగే వాంఖడే స్టేడియం కూడా కిక్కిరిసిపోయింది.