రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను కలిశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సిఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సిఎం రాష్ట్ర అభివృద్ధికి సహకిరించాలని కోరినట్లు చెప్పారు.
ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామని తెలిపారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కనరించాలని వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ప్రధాని మోదీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన హామీల పరిష్కారించాలని కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరినట్లు సిఎం రేవంత్ తెలిపారు. ‘రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులను కలిశాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి వినతి పత్రం ఇచ్చాం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విరక్తి చెందారు. ఆ పార్టీపై విరక్తితో ‘ఇండియా’ కూటమికి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని ప్రధానిని కోరామని తెలిపారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని విన్నవించినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. జిల్లాకొక నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరామన్న భట్టి, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని మోదీని కోరామన్నారు. ఈ క్రమంలోనే విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలని కోరామన్న ఆయన, భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని కోరామని చెప్పారు. తమ వినతులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా సానుకూలంగా స్పందించారన్న ఉప ముఖ్యమంత్రి, వారిద్దరికి కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
డ్రగ్స్, సైబర్ క్రైమ్ లపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి పోరు
విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు
తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు