సుప్రీంకోర్టును ఆశ్రయించిన నితీశ్‌ సర్కారు

నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసింది. బిహార్‌లో నితీశ్ కుమార్‌ సర్కారు ఇటీవల సవరించిన రిజర్వేషన్‌ చట్టాలను పాట్నా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీశ్ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోటాను 50 శాతం నుంచి 65 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఎన్‌డీఏ కూటమికి బిహార్‌లో రిజర్వేషన్లను పెంచడం ఇష్టం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రిజర్వేషన్లతో బీజేపీ ఆడుకోవాలని చూస్తుందని ఆర్‌జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ విమర్శించారు.  బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సమయంలో చెప్పామని పేర్కొన్నారు. విపక్షాల ఈ ఆరోపణల మధ్య ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

జూన్ 20న 65  శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 65శాతం రిజర్వేషన్లు నిలిచిపోయాయి. ఇకపై గతంలో మాదిరిగానే 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వం రిజర్వేషన్లు 65 శాతం పెంచగా.. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం 75 శాతానికి పెరగనున్నది. రిజర్వేషన్లను అమలులోకి తీసుకువస్తూ 2013 నవంబర్‌ 21న ప్రభుత్వం గెజిట్‌ను ప్రచురించింది. ఆ తర్వాత పలువురు రిజర్వేషన్లను హైకోర్టులో సవాల్‌ చేయగా.. రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.