పరువునష్టం కేసులో టిఎంసి ఎంపీ రూ.50 లక్షలు చెల్లించాల్సిందే

పరువునష్టం కేసులో రాజ్యసభ సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పూరీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఆయన పరువుకు భంగం కలిగించినందుకు రూ.50 లక్షలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. 
 
అంతేకాదు, సోషల్ మీడియాకు ఆరు నెలల పాటు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే 2021 జూన్ 13 నుంచి జూన్ 26 మధ్య మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పూరీని టార్గెట్ చేస్తూ టీఎంసీ నేత ఆరోపణలు చేశారు.  ఆమె స్విట్జర్లాండ్‌లో ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతేకాదు, ఆమె భర్త, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి పేరును కూడా ప్రస్తావించారు. 
 
దీంతో సాకేత్ గోఖలేపై లక్ష్మీపూరీ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు పరువు నష్టం కింద రూ.50 లక్షలు చెల్లించాలని, జాతీయ దినపత్రికలో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను ఎనిమిది వారాల్లోగా తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.
 
కరంజావాలా అండ్ కంపెనీ ద్వారా దావా వేసిన లక్ష్మీ పూరీ టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారని పేర్కొన్నారు. తన సంపాదనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మాజీ దౌత్య అధికారిణి తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదనలు వినిపించారు. 
 
తన క్లయింట్ పూరీ ఆ సమయంలో ఎటువంటి ప్రభుత్వ పదవులను నిర్వహించలేదని, అందువల్ల ఆమె అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. బహిరంగ ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోలేదని, ఆయన చర్యలు లక్ష్మీ పూరీ చిత్తశుద్ధిపై దాడిగా అభివర్ణించారు.
 
ఇదే సమయంలో గోఖలే తరఫు లాయర్ సరీమ్ నావేద్  ఓ పౌరుడిగా ప్రభుత్వ అధికారి ఆస్తుల గురించి ప్రశ్నించే అధికారం ఆయనకు ఉందని వాదించారు.