ఉత్తర్ప్రదేశ్లోని హత్రస్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో మహిళలు, పిల్లులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. రతిభాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ శివారాధన కార్యక్రమంలో ఈ విషాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
రతీభాన్పూర్లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆ యా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు.
ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దీని నిర్వహణకు ఎస్డీఎమ్ అనుమతి ఇచ్చారని సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్, సత్సంగ్ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, సహాయక చర్యలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హత్రాస్కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ను సీఎం ఆదేశించారు.
హత్రాస్ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టుపెట్టారు.
హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు సహితం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
More Stories
టీషర్ట్స్, చిరిగిన జీన్స్తో కాలేజీకి రావొద్దు
ఆగస్టు రెండోవారంలో నీట్- పీజీ పరీక్ష
మత మార్పిడీలతో మైనారిటీలు మెజారిటీలు అవుతారు