భారత్ మార్కెట్‌ నుండి కోకా కోలా నిష్క్రమణ!

భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా బాట్లింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న కోకాకోలా భారత్ లో తన బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ ను మూసేయాలని నిర్ణయించింది. భారత్ లో తమ కార్యకలాపాలను తగ్గించుకోవాలని కోకాకోలా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ లో గణనీయ స్థాయిలో మైనారిటీ వాటాను విక్రయించ తలపెట్టినట్లు తెలుస్తోంది. 
 
ఈ మేరకు నాలుగు భారత వ్యాపార సంస్థలను, వాటి యాజమాన్య కుటుంబాలను కోకాకోలా సంప్రదించినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లే ముందు మైనారిటీ వాటా విక్రయించాలని కోకాకోలా భావిస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ మూసివేతకు కారణాలు మాత్రం కోకాకోలా వెల్లడించలేదు.

కోకాకోలా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ హెన్రిక్యూ బ్రౌన్ ఈ మేరకు సంస్థ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ లకు ఇంటర్నల్ నోట్ పంపిణీ చేశారు. ‘జూన్ 30 నుంచి బిగ్ కార్పొరేట్ ఆఫీసు మూసేస్తున్నాం. బిగ్ హెడ్ క్వార్టర్స్‌ను మూసేస్తాం. మిగతా బాట్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమబద్ధీకరిస్తాం’ అని హెన్రిక్యూ బ్రౌన్ పేర్కొన్నారు. 

భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలను కోకాకోలా ఇంటర్నల్ బోర్డు పర్యవేక్షిస్తుందని ఆ నోట్ పేర్కొంది. భారత్‌లో బిగ్ పర్యవేక్షణలో నడుస్తున్న హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ పై నేరుగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గత జనవరిలో హెచ్‌సీసీబీ దేశంలోని తమ కంపెనీ ఆధీనంలోని బాట్లింగ్ కార్యకలాపాలను మూడు సంస్థలకు విక్రయించింది. ఉత్తర భారత్ లో మూన్ బేవరేజెస్, ఈస్ట్రన్ ఇండియాలో ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్, ఈశాన్య భారత్ లో కంధారి గ్లోబల్ బేవరేజెస్ సంస్థలకు విక్రయించింది.

తద్వారా కోకాకోలా 293 మిలియన్ డాలర్లు లాభ పడింది. దీని తర్వాత పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 16 ఫ్యాక్టరీలను మాత్రమే హెచ్‌సీసీబీ నిర్వహిస్తోంది. 2006లో కోకాకోలా తన బాట్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దేశంలో బాట్లింగ్ ఆపరేషన్స్ ప్రారంభించింది.