ఆంధ్ర వీసీపై న్యాయ విచారణకు టీడీపీ, బిజెపి డిమాండ్

వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ను వైసిపి కార్యాలయంగా మార్చివేసి, అంతులేని అక్రమాలకు, అవినీతి చర్యలకు పాల్పడిన ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి కేవలం తన పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, వైసీపీ హయాంలో యూనివర్సిటీలో జరిపిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలని టీడీపీ, బిజెపి నేతలు డిమాండ్ చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామాల నేపథ్యంలో పూర్వ విద్యార్థులు వర్సిటీకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిజెపి ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు  టిడిపిఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ వర్సిటీకి చేరుకుని వారి సంబరాలలో పాల్గొన్నారు. వర్సిటీకి వచ్చిన నేతలకు ఏయూ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.

ఏయూ వీసీగా పివిజిడి ప్రసాద్‌ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలపై ఈ సందర్భంగా జరిపిన మీడియా సమావేశంలో బిజెపి, టిడిపి, జనసేన కూటమి నేతలు మండిపడ్డారు.  అనకాపల్లి బిజెపి ఎంపీ సిఎం రమేష్‌ మాట్లాడుతూ  రాజీనామా చేసినంతమాత్రాన ప్రసాద్‌ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 
 
పవిత్రమైన విద్యాలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చారని, ఇక్కడి నుండే వైసిపి పార్టీ సర్వేలకు, ఇతర కార్యక్రమాలకు డబ్బుల పంపకాలు జరిగాయని ఆరోపించారు. కార్యాలయానికి ఎవరినీ రానీయకుండా ఇనుప ఫెన్షింగ్‌ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రసాద్‌ రెడ్డి చేసిన ప్రతి పనికి లెక్క ఉందని ఆ లెక్కలన్నీ త్వరలోనే తేలుస్తామని హెచ్చరించారు. 
 
భారతదేశంలో పేరున్న యూనివర్శిటీలో ఆంధ్రా యునివర్సిటీ ఒకటని, అలాంటి యునివర్సిటీ ప్రతిష్ట ప్రసాద్‌ రెడ్డి హయం లో తీవ్రంగా తెబ్బతిందని ఆయన ధ్వజమెత్తారు. దాదాపు రూ.100 కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రసాద్‌ రెడ్డిపై వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ ను, అలాగే ప్రభుత్వాన్ని రమేష్ కోరారు. విచారణ అనంతరం అతడిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014 – 19 లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాను ఎన్నో మార్పులు తీసుకువచ్చానని గుర్తు చేశారు. గతంలో ఎలా ఉండేదో యూనివర్సిటీని మళ్ళీ అదే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గతంలో ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేస్తామని, ఏయూ యూనివర్శిటీలో ఎలాంటి రాజకీయాలు లేకుండా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 
 
వర్సిటీలో వైఎస్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని గంటా ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. అడ్డగోలుగా పదవులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. 
 
ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేయబోమని చెబుతూ  ఎవరైనా రాజకీయాలు చేస్తామన్నా చంద్రబాబు ఊరుకోరని స్పష్టం చేశారు. వర్సిటీలోని వైఎస్‌ విగ్రహం తొలగించడం తమకు పెద్ద పనేమీ కాదని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ, విద్యార్థి సంఘాల అభిప్రాయం మేరకే దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.