![](https://nijamtoday.com/wp-content/uploads/2021/01/Petrol-price.jpg)
జులై 1వ తేదీ నుంచి ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ను తగ్గించడం ద్వారా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ 2024 ను ప్రకటిస్తున్న సమయంలో, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ఇంధన పన్నులను తగ్గిస్తున్నట్లు అజిత్ పవార్ ప్రకటించారు.
ఫలితంగా ముంబైలో పెట్రోల్ పై లీటరుకు 65 పైసలు, డీజిల్ పై లీటరుకు రూ . 2.60 తగ్గింది. తగ్గించిన ఇంధన ధరలు జూలై 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాలలో ఈ పెట్రో ధరల తగ్గింపు అమలు అవుతుంది. ముంబై రీజియన్ లో డీజిల్ పై పన్నును 24 శాతం నుంచి 21 శాతానికి తగ్గిస్తున్నామని అజిత్ పవార్ తెలిపారు.
ముంబై రీజియన్ లో పెట్రోల్ పై పన్నును 26 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వల్ల లీటర్ పెట్రోల్ పై 65 పైసలు తగ్గుతాయని చెప్పారు. వ్యాట్
తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.200 కోట్ల భారం పడుతుందని అజిత్ పవర్ వెల్లడించారు.
కాగా, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ పెట్రో ధరల తగ్గింపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాహన యజమానులకు ఉపశమనం కలగనుంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
More Stories
భారత్ మార్కెట్ నుండి కోకా కోలా నిష్క్రమణ!
భారత జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా
కేరళలో సీపీఎంపై హవాలా లావాదేవీ ఆరోపణలు