అమర్ నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బృందం

2024 సంవత్సర అమర్ నాథ్ యాత్రను తొలి బృందం భక్తులు శనివారం తెల్లవారుజాము నుండి ప్రారంభించారు. శుక్రవారం కశ్మీర్ లోయకు చేరుకున్న వారికి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా స్వాగతం పలికారు. ఈ బృందంలో మొత్తం 4,600 మంది యాత్రికులు ఉన్నారు. అమర్ నాథ్ భక్తులకు ముస్లింలు సహా స్థానికులు ఆదరంగా స్వాగతం పలకడం విశేషం.
అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు అధికార యంత్రాంగం, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించిందని, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్, బందిపోరా జిల్లాల్లో వారికి పూలమాలలతో స్వాగతం పలికినట్లు అధికారులు తెలిపారు. అనంత్ నాగ్ లోని సంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం ద్వారా, అలాగే, గండేర్ బల్ లోని 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా 52 రోజుల అమర్ నాథ్ యాత్రను కొనసాగిస్తారు. 
 
ఈ యాత్ర జూన్ 29, శనివారం ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. దక్షిణ కాశ్మీర్  లోని కుల్గాం జిల్లాలోని ఖాజీగుండ్ ప్రాంతంలోని నవయుగ్ సొరంగం గుండా 231 తేలికపాటి, భారీ వాహనాల్లో లోయకు చేరుకున్న యాత్రికులకు కుల్గాం డిప్యూటీ కమిషనర్ అథర్ అమీర్ ఖాన్, ఎస్ ఎస్ పి కుల్గాం, పౌర సమాజం, వ్యాపార వర్గాలు, పండ్ల పెంపకందారులు, మార్కెట్ సంఘాలు స్వాగతం పలికాయని అధికారులు తెలిపారు.

యాత్రికుల కాన్వాయ్ లు విడివిడిగా బల్తాల్, పహల్గామ్ లోని బేస్ క్యాంపులకు బయలుదేరాయని, అక్కడి నుంచి శనివారం తెల్లవారుజామున 3,880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహాలయానికి భక్తులు బయలుదేరుతారని అధికారులు తెలిపారు. 

పహల్గామ్ నుంచి వెళ్తున్న యాత్రికులకు అనంతనాగ్ లో డిప్యూటీ కమిషనర్ సయ్యద్ ఫక్రుద్దీన్ హమీద్, ఇతర అధికారులు స్వాగతం పలకగా, బల్తాల్ మీదుగా గుహాలయానికి వెళ్తున్న యాత్రికులకు శ్రీనగర్ లోని పంథా చౌక్ వద్ద డిప్యూటీ కమిషనర్ బిలాల్ మొహిఉద్దీన్ భట్, స్థానికులతో సహా ఇతరులు స్వాగతం పలికారు. అనంతరం బండిపోరాలో కాన్వాయ్ కు ఘనస్వాగతం పలికినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం ఉదయం ‘బమ్ భమ్ భోలే’, ‘హర హర మహాదేవ్’ నినాదాల మధ్య జమ్మూలోని భగవతి నగర్ లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలి బ్యాచ్ ను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రికులు సురక్షితంగా ప్రయాణించాలని సిన్హా ఆకాంక్షించారు. బాబా అమర్ నాథ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.

అమర్ నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు మూడంచెల భద్రత, ఏరియా డామినేషన్లు, విస్తృతమైన రూట్ మోహరింపు, చెక్ పోస్టులతో సహా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 19 వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని, అసౌకర్యాన్ని తగ్గించేందుకు రోజువారీ హెచ్చరికలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 

ఈ ఏడాది యాత్రకు 3.50 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. గుహాలయానికి వెళ్లే రెండు మార్గాల్లో 125 కమ్యూనిటీ కిచెన్లు (లంగర్లు) ఏర్పాటు చేయగా, వీటికి 6,000 మందికి పైగా వాలంటీర్లు సహకరిస్తున్నారు.