మార్కుల గణనపై ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు నోటీసులు

* ఇద్దరిని అరెస్టు చేసిన సిబిఐ

నీట్ యూజీ 2024లో అవకతవకలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8 వ తేదీలోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్ యూజీ 2024 పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదే రోజు విచారణ చేపడతామని పేర్కొంది. 

నీట్ యూజీ 2024 మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ పిటిషన్‌ను ఓ లెర్నింగ్ యాప్ దాఖలు చేసింది. మెడికల్ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్ షీట్లను పొందలేదని పేర్కొంది. దీనిపై గురువారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ బెంచ్ గురువారం వాదనలను ఆలకించింది. 

“ఒఎంఆర్ షీటు ఇవ్వడానికి ఏడైనా టైమ్‌లైన్‌ను మీరు పెట్టుకొన్నారేమో తెలియజేయండి. దీనిపై ఎన్‌టీఎను స్పందించనీయండి ” అని బెంచ్ పేర్కొంది. సంబంధిత పార్టీలు ఈ అంశంపై జులై 8 వ తేదీ లోగా వివరణలు పంపాలని ఆదేశించింది. అదే సమయంలో కోచింగ్ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది.

“ఇది కోచింగ్ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32 వ పిటిషన్. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది ? ఈ అంశంలో వారు పోషించడానికి ఏ పాత్ర కనిపించడం లేదు. చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుంది. కేంద్రం చేయాల్సిన పనులను వారు చూడాల్సిన అవసరం లేదు ” అని పేర్కొంది. 

ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగా, మరోవైపు సీబీఐ దర్యాప్తు జోరందుకుంది. నీట్ లీకులకు సంబంధించిన పలు అనుబంధ కేసులను పరిశీలిస్తోంది. ఈ కేసులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలో అవకతవకలకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు.

కాగా, రంగంలోకి దిగిన సిబిఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. తొలుత పాట్నాకు చెందిన మనీష్‌ ప్రకాష్‌, అశుతోష్‌లు నీట్‌ పేపర్‌ లీకేజి పాల్పడినట్లుగా సిబిఐ గుర్తించింది. గురువారం ఈ ఇద్దరు నిందితులను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.  ఈ ఇద్దరు నిందితులు పేపర్‌ని లీక్‌ చేయడమే గాకుండా విద్యార్థులు చదువుకునేందుకు సురక్షిత గృహాలను కూడా ఏర్పాటు చేసినట్లు సిబిఐకు చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. మనీష్‌ ప్రకాష్‌, అశుతోష్‌లిద్దరూ నీట్‌ పేపర్‌ను లీక్‌ చేశారు. 

ఈ పేపర్‌ ఆధారంగా విద్యార్థులు నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యేందుకు మనీష్‌ ప్రకాష్‌, ఈ కేసులో మరో నిందితుడైన అశుతోష్‌ వాళ్ల ఇంటికి విద్యార్థులను తన కారులోనే తరలించినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. వీరిద్దరినీ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారి తెలిపారు. కాగా, నీట్‌ పేపర్‌ లీకేజీ దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతిపక్షాలు విమర్శించడంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసింది.