ఐరాసలో భారత్ పై విషం కక్కి నవ్వుల పాలవుతున్న పాక్

అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగం అయిన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తరచూ విమర్శలనవ్వుల పాలు అవుతుంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్‌కు చెందిందని, పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎప్పటినుంచో భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ విదేశాల ముందు జమ్మూ కాశ్మీర్‌ ప్రస్తావన తీసుకువస్తూ పాకిస్తాన్ తన నక్క వినయాలు ప్రదర్శిస్తూనే ఉంది. 
 
అయితే ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించని భారత్ ఎప్పటికప్పుడు పాక్‌ను తిప్పికొడుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్యసమితిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తగా భారత్ ధీటుగా సమాధానం చెప్పింది.  జమ్మూ కాశ్మీర్‌పై పాక్ చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు అంటూ మండిపడింది. 
 
ప్రతీసారి అలవాటులో పొరపాటు లాగా చర్చను తప్పుదారి పట్టించే చర్యల్లో భాగంగానే పాక్ ఈ ఆరోపణలు చేసిందని, ఐక్యరాజ్యసమితిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకు ఆ దేశం ఇలాంటి అనవసర చర్చను చేస్తోందని మండిపడ్డారు.
 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా భారత్, జమ్మూ కాశ్మీర్ విషయాలను పాక్ ప్రతినిధి ప్రస్తావించడంతో భారత్ రంగంలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లు భారతదేశంలో అంతర్భాగమని మరోసారి తేల్చి చెప్పారు. 
 
భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత, నిరాధారమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆర్ రవీంద్ర స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను బయటికి రాకుండే ఉండేందుకే పాక్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు.