బిజెపి మిత్ర పక్షానికే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి!

లోక్‌సభ ఉప సభాపతి స్థానాన్ని కూడా ఎన్‌డిఎనే చేపడుతుందని, ప్రతిపక్షానికి దీనిని విడిచిపెట్టదని వెల్లడైంది. ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌గా బిజెపి ఎంపి ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యారు. సభా సాంప్రదాయం మేరకు చూస్తే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు దక్కాలి. 

అయితే ఇంతకు ముందటి రెండవ సారి అధికారపు దశలో ఈ స్థానాన్ని ఖాళీగా ఉంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్‌డిఎ పదిలం అయ్యేందుకు ఈ స్థానంలో మిత్రపక్ష అభ్యర్థిని కూర్చోబెట్టాలని సంకల్పించిన్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు తగ్గిన మెజార్టీ క్రమంలో సభానిర్వహణ క్రమంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు స్థానాల్లో బిజెపి, బిజెపి మిత్రపక్షం వారు పాగావేసుకుని ఉండాల్సిందేనని మోదీ 3.0 ప్రభుత్వం ఆశిస్తోంది. 

ఈ పదవికి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ పదవిలో తెలుగుదేశం పార్టీ వారిని కూర్కోచబెడుతారా? లేక జెడియూ అభ్యర్థిని ఎంపిక చేస్తారా? అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఈ రెండు పార్టీలు తొలుత స్పీకర్ పదవిపైనే కన్నేశాయి. గతంలో టిడిపికి చెందిన సీనియర్ నేత జిఎంసి బాలయోగి స్పీకర్ పదవి నిర్వర్తించారు.

దీనిని ఉదాహరణగా చూపి చంద్రబాబు నాయుడు టిడిపికి ఈ స్థానం దక్కాలని, స్పీకర్ స్థానంలో బాలయోగి కుమారుడు హరీష్ బాలయోగిని కూర్చోబెట్టాలని ప్రతిపాదించారు. కానీ బిజెపి ఇందుకు సమ్మతించలేదు. పాత స్పీకర్ బిర్లాకే పట్టం కట్టింది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిని సామరస్యంగా మిత్రపక్షానికి అప్పగించడం విషయంలో బిజెపి నాయకత్వం రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.

కాగా ప్రొటెం స్పీకర్ స్థానంలో కూడా తమ పక్షం వారిని నియమించకపోవడంతో అధికారపక్షంపై విపక్షాలు మరింత ఆగ్రహంతో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు దక్కాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నా ఇందుకు ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు లేవు.

స్పీకర్‌గా ఓంబిర్లాను ఏకగ్రీవంగా తీసుకువచ్చేందుకు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బుధవారం ప్రతిపక్షాలు షరతు పెట్టాయి. ముందు స్పీకర్ ఎంపిక తరువాత డిప్యూటీ స్పీకర్ విషయం ఆలోచించాల్సి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలనే ఆలోచన అయితే తమకు ఇప్పటికిప్పుడు లేదని కూడా బిజెపి నాయకత్వం రాజ్‌నాథ్ సింగ్ ద్వారా ప్రతిపక్షాలకు తెలిపింది.

ఇక మోదీ సర్కారు తొలి హయాంలో డిప్యూటీ స్పీకర్ పదవి అప్పట్లో బిజెపి మిత్రపక్షం అయిన అన్నాడిఎంకెకు చెందిన ఎం తంబిదురైకి దక్కింది. కాగా రెండో పర్యాయంలో ప్రతిపక్షం వేర్వేరుగా బలహీనంగా ఉండటంతో ఈ స్థానం ఖాళీగానే ఉంటూ వచ్చింది. కాగా ఇప్పుడు మూడోసారి ఇంతకు ముందటిలాగానే బిజెపి మిత్రపక్షానికి ఉపసభాపతి స్థానం దక్కుతుందని భావిస్తున్నారు.