రాహుల్‌ గాంధీకి యూపీ కోర్టు సమన్లు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి యూపీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరు కావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌ గాంధీని కోరింది. కేసు తదుపరి విచారణ జూలై 2న జరుగనున్నది. 
 
సుల్తాన్‌పూర్‌ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌, బీజేపీ నేత విజయ్‌ మిశ్రా ఆగస్టు 4, 2018లో రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు వేశారు. జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.  2018తో పాటు గతేడాది నవంబర్‌ 27న కోర్టు కాంగ్రెస్‌ నేతను విచారణకు పిలిచింది. ఫిబ్రవరి 20న రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్‌ను పొందారు.
అయితే, అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది.  అయితే, ఈ నెల 7న కొత్వాలి నగర్‌కు చెందిన రామ్‌ ప్రతాప్‌ అనే వ్యక్తి ఈ కేసులో తనను పార్టీగా మార్చాలని కోర్టును కోరారు. అయితే, దీన్ని బీజేపీ నేత విజయ్‌ మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్‌ పాండే వ్యతిరేకించారు.
 
 కేసును జాప్యం చేసేందుకు పిటిషన్‌ దాఖలు చేశారని ఆరోపించారు. అయితే, పిటిషన్ కోర్టు తిరస్కరించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్‌ గాంధీకి సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది.