
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.
అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ అని చెప్పారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని స్పష్టం చేశారు. గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్