స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో నిధుల మాయంపై పవన్ విస్మయం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో నిధుల మాయంపై పవన్ విస్మయం
2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్   ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా? అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తుపోయారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని చెప్పారు. 
 
అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయిందని వివరించారు. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించిందని తెలిపారు.
 
 వీటిల్లో రూ.46 కోట్లు ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయని చెప్పారు. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే అధికారులు తెలిపారు.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు.  కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఆయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ అని చెప్పారు. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని స్పష్టం చేశారు. గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.