అయోధ్యలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్

* గర్బగుడిలో ఎటువంటి లీక్‌లు కాలేదని స్పష్టం
 
అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంఅంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
అనంతరం పర్యావరణ శాఖ మంత్రి జైవీర్‌ సింగ్‌ సదరు వివరాలు వెల్లడించారు.
మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్లపాటు లీజుకు ఇస్తామని చెప్పారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టాటా సన్స్‌ ప్రతినిధులు గతంలోనే తమ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. యోగీ సర్కార్‌ని సంప్రదించాలని సూచించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు టెంపుల్‌ సిటీ అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్‌ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పురాతన చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మెరుగులు దిద్దడంతోపాటు లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, కపిలవాస్తు ఏరియాల్లో పీపీపీ విధానంలో హెలికాప్టర్‌ సేవలను తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.

అయోధ్య రామమందిరం గర్భాలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్నట్టు వచ్చిన ఆరోపణలను ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా కొట్టిపారవేసారు. గర్బగుడిలో ఎటువంటి లీక్‌లు కాలేదని స్పష్టం చేశారు. విద్యుత్ కేబుల్స్ కోసం పెట్టిన పైపులను మూసివేయకపోవడంతోనే అందులో నుంచి నీరు లోపలికి వచ్చిందని తెలిపారు. 

మొదటి అంతస్తులో పనులు ఇంకా జరుగుతున్నాయని, రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఒక్క నీటి చుక్క కూడా లోపలికి రాదని చెప్పారు. జులై నాటికి మొదటి అంతస్తు పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు.

‘ఆలయ నిర్మాణ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాను.. పైకప్పు నుంచి ఎటువంటి లీక్‌లు లేవు.. విద్యుత్ వైర్ల కోసం పెట్టిన పైపులు ఇంకా తెరిచి ఉంచడంతో అందులోంచి వర్షపు నీరు లోపలికి వచ్చింది. మొదటి అంతస్తులో పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం ప్రారంభమైంది.. ఇది పూర్తయితే ఆలయం లోపలికి నీరు రావడం ఆగిపోతుంది’ అని మిశ్రా చెప్పారు. వచ్చే డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని ట్రస్ట్ ఛైర్మన్ తెలిపారు.