జులైలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ  జులైలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. భారత్ – రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ ఈ సమాచారం వెల్లడించింది. మోదీ  పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్‌తో ఆయన సమావేశం ఉంటుందని మార్చినెలలో క్రెమ్లిన్ వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలు ఉన్నప్పటికీ, మనం మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా మాస్కో- ఢిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలోనే పుతిన్ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోదీతో మాట్లాడానని చెప్పారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా భారత ప్రధాని తన వంతు ప్రయత్నాలు చేస్తారని తనకు తెలుసని పేర్కొన్నారు. అలాగే తన స్నేహితుడు మోదీని కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.  ఆయన రష్యా వస్తే వర్తమాన అంశాలు, రెండు దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకే ఆయన దేశంలో పర్యటించాలని గతంలో ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే వీరి భేటీకి చెందిన క‌చ్చిత‌మైన తేదీని ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ జూలై 8వ తేదీన ఈ భేటీ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కొన్ని క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. పుతిన్ విదేశాంగ వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి యూరి ఉషోకోవ్ మాత్రం దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ ఏడాది బ్రిక్స్ నేత‌ల స‌మావేశాల్లోనూ ఇద్ద‌రూ క‌లుసుకోనున్న‌ట్లు భావిస్తున్నారు. క‌చ‌న్ న‌గ‌రంలో ఈ స‌మ్మిట్ జ‌ర‌గ‌నున్న‌ది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ర‌ష్యాలో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో మోదీకి పుతిన్ ఆహ్వానం అందించిన‌ట్లు తెలుస్తోంది.