తమిళనాడు కల్తీసారా ఘటనపై ఎందుకీ మౌనం?

* 58కి పెరిగిన మృతులు

తమిళనాడులో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజల మరణాలకు దారితీసిన కల్తీసారా దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. తమిళనాడు కల్తీసారా దుర్ఘటన పూర్తిగా మానవ తప్పిదం వల్ల జరిగిన విషాదమని ఖర్గేకు రాసిన లేఖలో నడ్డా పేర్కొన్నారు.

డిఎంకె సారథ్యంలోని అధికార ఇండియా కూటమికి, కల్తీసారా మాఫియాకు మధ్య బలమైన సంబంధాలు లేకుండా ఉండి ఉంటే 56 మంది ప్రాణాలు కాపాడి ఉండవచ్చని నడ్డా తెలిపారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అత్యంత ఘోరమైన కల్తీసారా దుర్ఘటన అనంతరం కల్లకురిచిలోని కరుణపురం గ్రామంలో ఎగసిపడుతున్న చిత మంటలకు సంబంధించిన చిత్రాలను చూసి యావద్దేశ ఆత్మసాక్షి క్షోభించిందని నడ్డా తెలిపారు.

మీడియా కథనాలను ఉటంకిస్తూ, అక్రమ మద్యం వ్యాపారం బహిరంగంగా, శిక్షార్హతతో నడుస్తోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహం ఉందని నడ్డా స్పష్టం చేశారు. విపత్తు సంభవించినప్పుడు, జవాబుదారీతనం, ప్రాణాలను రక్షించే బదులు, రాష్ట్ర పరిపాలన కప్పిపుచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉందని ఆయన ఆరోపించారు. ఆ విధంగా కప్పిపుచ్చడం ప్రాణాంతకంగా మారడమే కాకుండా ఎక్కువ మంది ప్రాణాలను కోల్పోవడానికి దారితీసిందని ఆయన ధ్వజమెత్తారు.
 
అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెబుతూ, ప్రధాన నిందితుడిని కొద్ది రోజుల క్రితం పోలీసులు వదిలిపెట్టారని నడ్డా చెప్పారు. బహుశా రాజకీయ ప్రోత్సాహం, శాంతిభద్రతల వ్యవస్థలో అవినీతి కారణంగా జరిగి ఉండవచ్చని పేర్కొంటూ ఇటువంటి వాస్తవాలను బట్టి, దీనిని “ప్రభుత్వ ప్రాయోజిత హత్య’ అని కాకుండా మరేదైనా పేర్కొనవచ్చా? అని నడ్డా ప్రశ్నించారు. 

షెడ్యూల్డు కులాల జనాభా అధికంగా ఉన్న కరుణపురం పేదరికం, వివక్ష కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇంతటి ఘోర విపత్తు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస పార్టీ మౌన ముద్ర దాల్చడం తనను దిగ్భాతికి గురిచేస్తోందని ఆయన ఖర్గేకు రాసిన లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  తమిళనాడులో ఇటీవల జరిగిన కల్తీసారా దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోగా 159 మంది ఆగసుపత్రి పాలయ్యారు. కొన్ని అంశాల విషయంలో తాము పార్టీలకతీతంగా వ్యవహరించాలని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల భద్రత, సంక్షేమం కూడా అందులో ఒకటని ఆయన చెప్పారు. 

ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించేలా తమిళనాడులోని డిఎంకె సారథ్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వంఐ ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఖర్గేను నడ్డా కోరారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

కాగా, ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం వరకూ కల్తీసారా ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 58కి పెరిగినట్లు కళ్లకురిచి జిల్లా కలెక్టర్‌ ఎమ్ఎస్‌ ప్రశాంత్‌ తెలిపారు. విళుపురం, కళ్లకురిచి, సేలం, పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన 11 మందిని సీబీసీఐడీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.