పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్య కన్నుమూత

మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య (65) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంచుమేళం- కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలకు ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.

ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పద్మ శ్రీ రామచంద్రయ్యకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి నగదుతో పాటుగా ఇంటి స్థలాన్ని ప్రకటించింది. అయితే రామచంద్రయ్యకు ప్రకటించిన నగదు పారితోషికం ఇప్పటికీ అందలేదు. 

పైగా ఇంటి స్థలం పత్రాలు కూడా ఇవ్వలేదు. వయస్సు రీత్యా రామచంద్రయ్య ఆరోగ్యం క్షీణించడంతో, వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని ఇటీవల మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాన్ని అందించాలని కోరారు.  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆయనకు భార్య బాపనమ్మ, కుమారుడు బాబూరావు, కుమార్తెలు వాణి, వసంత, సుమలత ఉన్నారు.

 గత ఏడాది డిసెంబరు నుంచి తన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, రూ.14 లక్షల వరకు అప్పులు తెచ్చి ఖమ్మం, హైదరాబాద్‌, విజయవాడకు తీసుకెళ్లి వైద్యం చేయించామని రామచంద్రయ్య కుమారుడు బాబూరావు తెలిపారు. అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోయామన్నారు.

కాగా, సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవారు. కోయ తెగల చరిత్రను, విశిష్టతను గానం చేస్తూ కోయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

దీంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. డోలి కులస్తులు భద్రాచలం, ఏటూరు నాగారం, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రను చెప్పే ఏకైక కళాకారుడు రామచంద్రయ్యే కావడం గమనార్హం. ఈ కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వ్యక్తిగా ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

రామచంద్రయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు పెద్దఎత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి.. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడిన రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటు అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య మృతి బాధాకరం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. కోయ, తెలుగు భాషల్లో సమ్మక్క, సారలమ్మ చరిత్రపై కంచుతాళం- కంచుమేళం గానం చేసే గొప్ప వ్యక్తని రామచంద్రయ్యను మంత్రి కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్…ప్రగాడ సంతాపం తెలిపారు. మరణ వార్త తెలిసిన వెంటనే రామచంద్రయ్య ఇంటికి వెళ్ళారు కలెక్టర్.  సకిని బౌతిక కాయం పై పూల మాల వేసి నివాళి ర్పించారు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు