బంగ్లా ప్రధాని షేఖ్ హసీనా ఢిల్లీ రాక

ప్రధాని నరేంద్ర మోదీ  ఆహ్వానంపై బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా రెండు రోజుల అధికార పర్యటనపై శుక్రవారం భారత్‌కు వచ్చారు. కొత్తగా నియుక్తుడైన కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానికి స్వాగతం పలికారు. 

ఆమె పర్యటన భారత్, బంగ్లాదేశ్ సంబంధాలకు‘పెద్ద ప్రోత్సాహకం’ అవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించారు. ‘బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా భారత్‌కు అధికార పర్యటనపై న్యూఢిల్లీకి వచ్చారు. బంగ్లాదేశ్ భారత్‌కు కీలక భాగస్వామి, విశ్వసనీయ పొరుగుదేశం.

ఈ పర్యటన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకం అవుతుంది అని జైశ్వాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు, 18వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇది తొలి ద్వైపాక్షిక అధికార పర్యటన అని ఎంఇఎ ఒక రోజు ముందు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.  ‘ఈ పర్యటనలో ప్రధానితో ద్వైపాక్షిక సంప్రదింపులు సాగించడంతో పాటు ప్రధాని షేఖ్ హసీనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోను, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తోను భేటీ కానున్నారు’ అని ఆ ప్రకటన తెలియజేసింది.

బాంగ్లాదేశ్ తమవైపు తీస్తా నదిని అభివృద్ధి చేయాలని చూస్తున్నది. ఈ అంశంతో పాటు తన రెండు రోజుల భారత్ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై భారత్ తో సంతకాలు చేసుకొని అవకాశం ఉంది. జూన్ 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంకు హాజరైన ఆమె ఓ పక్షం రోజుల లోపుగానే తిరిగి భారత్ పర్యటనకు రావడం గమనిస్తే రెండు దేశాల మధ్య సంబంధాల ప్రాధాన్యత వెల్లడి అవుతుంది.

జులైలో చైనా పర్యటనకు వెడుతున్న ప్రధాని హసీనా భారత్, చైనాలతో తమ సంబంధాల మధ్య ఒకేసారి మంచి సంబంధాలకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది. ఆమె భారత్ కు చేరుకున్న కొద్దీ సేపటికే విదేశాంగ మంత్రి డా. జైశంకర్ ఆమెతో భేటీ జరిపారు. ఆమె అధికార పర్యటన రెండు దేశాల మధ్య గల సన్నిహిత సంబంధాలను వెల్లడి చేస్తుందని పేర్కొంటూ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా మెరుగు పరచేందుకు ఆమె సలహాలు ఎంతో ఉపయోగం అని కొనియాడారు.