ఆర్నెల్లలో లక్ష మంది ఐటి ఉద్యోగులపై వేటు!

ఆర్నెల్లలో లక్ష మంది ఐటి ఉద్యోగులపై వేటు!
ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. స్టార్టప్‌లు మొదలుకొని దిగ్గజ కంపెనీల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దాదాపు లక్షమంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో మొదలైన తొలగింపుల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అమెజాన్‌, ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా తదితర బడా కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఆర్థిక మందగమనం, కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడం, కరోనా తర్వాత డిమాండ్‌ తగ్గడం, ఖర్చుల తగ్గింపులో భాగంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతుండటం.. ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం. 2022లో 1,064 కంపెనీలు సుమారు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఆ మరుసటి ఏడాది లేఫ్‌లు మరింత పెరిగాయి.

 2023లో 1,175 కంపెనీలు 2.6 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022తో పోలిస్తే ఇది 58 శాతం అధికం. కొన్ని నెలలుగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నప్పటికీ, 2024లో కూడా లేఆఫ్స్‌కు అడ్డుకట్ట పడే సంకేతాలు కనిపించడం లేదు. చాలా కంపెనీలు బయటకు ప్రకటించకుండానే సైలెంట్‌గా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

గత ఏడాది సుమారు 20 వేల మంది టెకీలు ఇలా ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ, ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వెల్లడించింది.  ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 2 వేల నుంచి 3 వేల మందిని భారత ఐటీ కంపెనీలు సైలెంట్‌గా ఇంటికి పంపాయని నాస్కెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌) తెలిపింది.

కాగా, పేటీఎంపై పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా చట్టవిరుద్ధంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. పేటీఎం మేనేజ్‌మెంట్‌ తమను అనైతికంగా పనిలోంచి తొలగించిందని జూన్‌ మొదటి వారంలో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.