
డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డిని ఈసీ తొలగించి హరీశ్కుమార్ గుప్తాను నియమించింది.
ఆయన్నే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆ రోజున ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి.. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీప్రమాణం చేయించాల్ని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.
ఆయన కాన్వాయ్ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్ నియంత్రణలో విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్ కాన్వాయ్కు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై ప్రధాని మోదీ కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు తిరుగు ప్రయాణ సమయంలో తనకు వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఎవరు రావద్దంటూ ఒక్కరే వెళ్లిపోయారు.
సాధారణంగా డీజీపీని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం సమయం లేకపోవడంతో ప్రభుత్వం నియమించింది. నేరుగా డీజీపీ పోస్టు ఇవ్వకుండా డీజీపీ (కో-ఆర్డినేషన్) పోస్టులో నియమించింది. ఆ స్థానంలో ఉండి ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గుప్తాకు తిరిగి హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత అప్పగించింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు