అమరావతికి సాష్టాంగ వందనం చేసిన చంద్రబాబు 

అమరావతికి సాష్టాంగ వందనం చేసిన చంద్రబాబు 
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూసి, ఆ ప్రాంతంలో పాడుబడినట్టు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగానికి గురయ్యారు.  సాష్టాంగపడి నమస్కరించారు. ఆ తర్వాత పైకి లేచి శంకుస్థాపన వేదికకు ప్రణమిల్లారు. దేశవ్యాప్తంగా నీరు- మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.

గొప్ప సంకల్పంతో నిర్మించ తలపెట్టిన అతిరథ మహారథులను ఆహ్వానించిన చోట, ప్రస్తుతం పాడుబడిన ప్రాంతంగా మారిన పరిస్థితిని చూశారు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముందుగా అక్కడ నెలకొన్న పరిస్థితులను చూసేందుకు ఆయన గురువారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన ప్రాంతం, దారుణ పరిస్థితుల్లో ఉండటంపై తీవ్ర ఆవేదన చంద్రబాబు కళ్లలో వ్యక్తమైంది.

తొలుత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్‌ ప్రభుత్వంలో, కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు కూడా జగన్‌ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టమని ఇటీవల తేల్చిచెప్పారు.

చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్‌ యాక్సెస్​ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్ట మట్టిసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ, జగన్‌ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవడాన్ని గమనించారు. సీడ్‌ యాక్సెస్​ రహదారి మీదుగా చంద్రబాబు అమరావతి శంకుస్థాపనన జరిగిన ఉద్ధండరాయునిపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు. విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో రాజధానిలో పర్యటించారు.

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని చెబుతూ అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందిన్న ఆయన… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రాంతంలో పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పాలన నుంచి అమరావతిని దేవుడే కాపాడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ప్రజావేదికను కూల్చివేయించిన చరిత్ర జగన్ ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఖజానా మొత్తాన్ని జగన్ ఖాళీ చేశారని ఆరోపించారు.  “అమరావతి ప్రజా రాజధాని. విశాఖ ఆర్ధిక రాజధాని. కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తాం. రాయలసీమ సహా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం” అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
 
అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? పనులు ఎప్పటిలోపు అవుతాయనే దానిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చంద్రబాబు చెప్పారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఓ అంచనాకు వస్తామని తెలిపారు.