
పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేసింది. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ గత టిడిపి ప్రభుత్వంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగన్, వైఎస్ఆర్ పేర్లను సంక్షేమ పథకాలను జోడించారు. తాజాగా ఈ పథకాలకు పూర్వపు పేర్లనే పెట్టాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ సర్కులర్ ఆధారంగా ప్రభుత్వ వెబ్సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయనున్నారు.
పథకాల పేర్ల మార్పు ఇలా
- జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
- జగనన్న విదేశీ విద్యా దీవెన – అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి
- వైఎస్ఆర్ కల్యాణమస్తు – చంద్రన్న పెళ్లికానుక
- వైఎస్ఆర్ విద్యోన్నతి -ఎన్టీఆర్ విద్యోన్నతి
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం – ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
కాగా, ఎలక్షన్ కోడ్ సమయంలో గ్రామా, వార్డు సచివాలయాలకు ఇచ్చిన హైసెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. హైసెక్యూరిటీ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫొటో కలిగి ఉన్న సర్టిఫికెట్ ను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.
2019 మే నెలకి ముందు ప్రారంభమై, 2019 – 2024 మధ్య కొనసాగించని ప్రభుత్వ పథకాల పేర్లు మరల 2019లో ఎలా ఉండేవో ఆ విధంగా మార్పు చేయాలని పేర్కొంది. 2019-24 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను వెంటనే తొలగించి, కొత్తగా పేర్లు పెట్టే వరకు సాధారణ పేరును మాత్రమే ఉపయోగించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో పార్టీ జెండా రంగులను తీసివేయాలని ఆదేశించింది. పాస్ పుస్తకాలపై, లబ్ధిదారుల కార్డులపై, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉన్నట్టయితే వాటిని వెంటనే నిలుపుదల చేయాలని పేర్కొంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు