వారణాసిలో నేడే ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మందికి పైగా రైతులకు రూ.20,000 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు వ్యవసాయ (కృషి) సఖి శిక్షణ పొందిన 30,000 మందికిపైగా స్వయం సహాయ సంఘాల మహిళలకు ధ్రువీకరణ పత్రాలను ప్రధాని మోదీ ప్రదానం చేయనున్నారు.
 
ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగాగల 732 వ్యవసాయాభివృద్ధి కేంద్రాలు (కేవీకే), లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం 2.5 కోట్ల మందికి పైగా రైతులు వీడియో మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

మరోవైపు ఎంపిక చేసిన 50 కేవీకేలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. 

అలాగే ‘పీఎం-కిసాన్’ లబ్ధిదారులకు తమ అకౌంట్ స్టేటస్, నిధుల జమను చూసుకోవడం, ‘కిసాన్-ఇమిత్ర చాట్‌బాట్’ వినియోగించే విధానం వంటివి కూడా నేర్పుతారు. ఈ కేంద్రాల పరిధిలో ‘వ్యవసాయ సఖి’ శిక్షణ పొందిన మహిళలకు కేంద్రమంత్రులు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేస్తారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అన్నదాతకు ప్రధాని మోదీ నిరంతరం చేయూత అందిస్తున్నారని, . ఆ మేరకు 2019లో మోదీ శ్రీకారం చుట్టిన ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.3.04 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని చౌహాన్ తెలిపారు. 

దేశంలో నేటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలు లభిస్తుందని చెప్పారు. దేశ ఆహార నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక సహా నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు వ్యవసాయ రంగ ప్రగతిపై ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమని వివరించారు.