స్విస్‌ శాంతి సదస్సు ప్రకటనపై సంతకం చేయని భారత్

ఉక్రెయిన్‌ యుద్ధంపై పశ్చిమ దేశాల ఆధ్వర్యంలో జరిగిన స్విస్‌ శాంతి సదస్సు రూపొందించిన తుది ప్రకటనపై సంతకాలు చేయడానికి భారత్, సౌదీ అరేబియాలతో సహా ఓ డజను దేశాలు తిరస్కరించాయి. ఈ సదస్సుకు 180 దేశాలను ఆహ్వానించగా 92 దేశాలు, 8 అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి. సదస్సుకు ఆహ్వానించనందున రష్యా హాజరుకాలేదు. 
 
రష్యా లేకుండా ఉక్రెయిన్‌లో శాంతి గురించి మాట్లాడడం అర్థం లేదన్న అభిప్రాయంతో చైనా కూడా హాజరు కాలేదు. రష్యా, చైనా లేకుండా ఈ సదస్సు చేసే తీర్మానానికి విలువేముంటుందని ఆర్మేనియా, బ్రెజిల్‌, ఇండియా, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో సహా 12 దేశాలు దానికిపై సంతకానికి తిరస్కరించాయని ఆర్‌ఐఎ నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. 
 
డిక్లరేషన్‌కు 79 దేశాలు ఆమోదం తెలిపాయి. వీటిలో హంగరి, సెర్బియా, టర్కీ, జార్జియా వంటి దేశాలతో బాటు నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. తుది ప్రకటన ఇంకా బయటకు రానప్పటికీ, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల పెద్దయెత్తున మానవాళి ఇబ్బందులెదుర్కొంటున్నారని, ఆస్తుల నాశనమవుతున్నాయని, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోందని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. 
 
యుద్ధ ఖైదీల మార్పిడి పూర్తి స్థాయిలో జరగాలని, అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించాలని ఆ ప్రకటన పిలుపునిచ్చింది. ఈ సమస్యకు అర్థవంతమైన పరిష్కారం కుదరాలంటే రష్యాను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని సౌదీ అరేబియా ఇంతకుముందే వ్యాఖ్యానించింది. కొన్ని పదాలపై అభ్యంతరాలతోనే ఈ దేశాలు సంతకం చేయలేదని ఆస్ట్రియా చాన్సలర్‌ కార్ల్‌ నెమార్‌ అన్నారు.
 
చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) పవన్ కపూర్ నాయకత్వం వహించారు.  “సదస్సులో భారతదేశం పాల్గొనడం, అలాగే ఉక్రెయిన్ శాంతి ఫార్ములా ఆధారంగా గతంలో జరిగిన ఎన్ ఎస్ ఏ/పొలిటికల్ డైరెక్టర్-స్థాయి సమావేశాలలో చర్చలు, దౌత్యం ద్వారా వివాదానికి శాశ్వతమైన, శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి మా స్థిరమైన విధానానికి అనుగుణంగా ఉంది” అని భారత్ తెలిపింది.
 
అయితే అటువంటి తీర్మానానికి ఈ విషయంలో రెండు పక్షాల మధ్య చిత్తశుద్ధితో కూడిన, ఆచరణాత్మకమైన పక్రియ అవసరమని విశ్వసించడానికి, భారతదేశం అన్ని వాటాదారులతో పాటు ఇరు పక్షాలతోనూ నిమగ్నమై ఉండి, ముందస్తుగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలకు దోహదపడుతుందని స్పష్టం చేసింది.
పాశ్చాత్య శక్తులు,  ఇతర దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై ఏకాభిప్రాయం కోసం ముందుకు వచ్చాయి, అయితే కొన్ని దేశాలు దాని తుది తీర్మానాలను తిరస్కరించాయి. అయితే ఈ సదస్సును వృద్ధ పక్రియ అంటూ రష్యా కొట్టిపారేసింది.