వైద్యారోగ్యశాఖకు అనారోగ్యం- పూర్తిగా ప్రక్షాళన చేస్తాం

వైసిపి హయాంలో రోగస్థమైన వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన గావిస్తామని,  ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. 
 
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరి చేస్తామని స్పష్టం చేశారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాని తెలిపారు. 
 
క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స, నివారణకు చర్యలు తీసుకుంటాం, వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ, ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఎయిమ్స్‌ తరహాలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అక్రమాలతో అనారోగ్యం పాలైందని, జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. 
 
అలాగే 18 ఏళ్ల లోపు వారి ఆరోగ్యం కోసం రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్ చేసే దస్త్రంపై మరో సంతకం చేశారు.  ఆరోగ్య శ్రీ పేరిట కొన్ని ఆస్పత్రులకు, దళారులకు ప్రజాధనం దారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఆస్పత్రులకు రూ. 1500 కోట్ల నిధులు ఇవ్వకుండా బకాయి పెట్టారని విమర్శించారు. 
 
వైద్యం కోసం కేంద్రం నుంచి వచ్చిన 60 శాతం నిధులనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. వైద్య రంగం కోసం రాష్ట్రం తన వంతు వాటా ఇవ్వకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎయిమ్స్ తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎయిమ్స్ లో అందించే సేవలపై అధ్యయనం చేసి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.