‘ప్రాణహిత – చేవెళ్ల కాదని కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు?

ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా, భారీ వ్యయంతో ఎత్తిపోతలు చేపట్టాల్సిన అవసరం, అందుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడింది. 

ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతలతో పాటు మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విషయమై ఐదుగురు సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆరా తీస్తోంది.

ప్రాణహిత – చేవెళ్లను కాదని కాళేశ్వరం చేపట్టడానికి గల కారణాలు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారన్న విషయాలను నివేదించాలని నీటి పారుదల శాఖను కమిషన్ ఆదేశించింది. గోదావరిలో నీరు ఉండగా, ప్రాణహిత జలాలను ఎత్తి పోయాల్సిన అవసరం ఏమిటన్న విషయమై కూడా కమిషన్ ఆరా తీస్తోంది. 

ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్కు సంబంధించి పూణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచి కూడా నివేదిక కోరారు. జూలై మొదటి వారంలో నివేదికలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

విజిలెన్స్ విభాగం నుంచి కూడా తుది నివేదిక కోరారు. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇవాళ ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం విభాగాల ఇంజినీర్లు హాజరయ్యారు. 

మూడు ఆనకట్టలకు సంబంధించి వారిని విచారణ చేశారు. ఆ వ్యవహారాలకు సంబంధించి వారు నిర్వర్తించిన పాత్ర, సంబంధిత అంశాల గురించి ఆరా తీశారు. దీంతో ఇంజినీర్లకు సంబంధించిన విచారణ దాదాపుగా పూర్తయింది. ఈ నెల 27వ తేదీలోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక, 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.