మోదీతో సెల్ఫీ దిగిన ఇట‌లీ ప్ర‌ధాని

జీ7 దేశాల భేటీకి వెళ్లిన ప్ర‌ధాని నరేంద్ర మోదీ భారత్ కు తిరిగి వ‌చ్చేశారు. అయితే శుక్ర‌వారం అక్క‌డ ప్ర‌ధాని మోదీతో ఇట‌లీ ప్ర‌ధాని మెలోని సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పట్టుకున్న మెలోనీ మోదీతో ఫోటో దిగారు. ఆ సెల్ఫీ ఫోటో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. 
 
జీ7 శిఖ‌రాగ స‌ద‌స్సు సంద‌ర్భంగా జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో మోదీ పాల్గొన్నారు. ఇట‌లీలోని అపులియాలో స‌మావేశాలు జ‌రిగాయి. సెల్ఫీ దిగుతూ ఇద్ద‌రూ చిరునవ్వులు చిందించారు.  గ‌త ఏడాది దుబాయ్‌లో కాప్‌28 స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యంలో కూడా సెల్ఫీ దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 
 
మూడ‌వ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇటలీ వెళ్లారు. ఇద్ద‌రూ ద్వైపాక్షిక ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా స‌హకారంపై చ‌ర్చించారు.  ఇటలీలో జి 7 దేశాల అవుట్‌ రీచ్‌ సదస్సుకు హాజరైన మోదీ  వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు.
 
 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌ స్కీ తదితరులతో మోదీ  అనేక అంశాలపై చర్చలు జరిపారు. దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ  చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే. 
 
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడిని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు. ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ  స్పందిస్తూ … జి 7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని వివరించారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కఅతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.