నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కులు రద్దు

నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థుల గ్రేస్‌ మార్కులు రద్దు
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకావం కల్పిస్తామని తెలిపింది. 

అవకతవకల ఆరోపణలపై స్పందించి కేంద్ర విద్యాశాఖ గతవారం నలుగురు సభ్యులతో నియమించిన కమిటీని విచారణ జరిపి సంపారించిన నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్‌ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్‌ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్‌ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్‌ మార్కులు లేకుండా ఒరిజినల్‌ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది.

మరోవైపు నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్‌ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.

మరోవంక, నీట్-యూజీ మెడిక‌ల్ ఎంట్రెన్స్ ప‌రీక్ష పేప‌ర్ లీకైన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ కొట్టిపారేశారు. నీట్‌-యూజీ పేప‌ర్ లీక్‌పై ఆధారాలు లేవ‌ని, ఎన్టీఏలో అవినీతి జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు నిజం కాదని, అది చాలా న‌మ్మ‌క‌మైన సంస్థ అని మంత్రి ప్ర‌దాన్ తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వాద‌న‌లు వింటోంద‌ని, కోర్టు ఇచ్చే తీర్పుకు క‌ట్టుబడి ఉంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని భరోసా ఇచ్చారు.