రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ నగరంలో బీజేపీకి చెందిన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టి రాజా సింగ్‌కు గత కొన్నేళ్లుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారులకు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదులు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.  తనకు కొన్ని పాకిస్థానీ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తెలిపారు. 
 
ఎట్టకేలకు, హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని ఫూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ వాసీం (40) అనే నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను నిరంతరం రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్నాడని గుర్తించారు. వీవోఐపీ కాలింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించి యాదృచ్ఛిక నంబర్లు తయారుచేస్తున్నాడని, అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
 
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తూ తనకు  +619664800063233 నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని రాజా సింగ్ గత ఏడాది చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపుకు ముందే అతడిని, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు.
 
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపాలని కూడా ప్లాన్ చేసినట్లు కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడని రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
విచారణలో కాల్ డేటా విశ్లేషణ, ఇతర వివరాలను ధృవీకరించినప్పుడు నిందితుడు జెడ్డా (సౌదీ అరేబియా)లో ఉంటున్నట్లు గుర్తించారు. అతడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసి) జారీ చేసి భారత్‌కు రప్పించేందుకు కృషి చేశారు. చివరకు హైదరాబాద్‌లోని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం భారత్‌కు రాగానే అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.
 
ఐఎంఈఐ నంబర్లు 869329059101611,  869329059101603లతో పాటు మొబైల్ నంబర్లు 966546836395 ఉన్న సిమ్  కార్డ్‌తో కూడిన విఇవిఓ మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా విభాగం ఏసీపీ చాంద్ బాషా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ ఏసీపీ ఆర్ జీ శివ మారుతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె సైదులు నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది.