ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చార్జ్‌షీట్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చార్జ్‌షీట్‌
సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని– టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 
 
ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్‌కుమార్‌ పేర్లను ప్రస్తావించారు. వీరిలో అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీ య దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాల ను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృ ష్టికి తెచ్చారు.ఛార్జిషీట్ దాఖలు చేసినా కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉందని, నిందితులకు బెయిల్ మంజూరు  చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటి షన్లపై వాదనలు పూర్తి అవడంతో ఈ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును బుధవారం వెల్లడించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్‌పి తిరుపతన్న కీలకంగా వ్యవహరించిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే. 

ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్‌lతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు. 

ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. మొత్తం 300మంది సెల్‌ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలో మూడు సిస్టమ్స్‌తో పాటు తొమ్మిది లాగర్స్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని పేర్కొన్న పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన పోలీస్ అధికారుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆయనదేనని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల రాష్ట్ర భద్రతకు తీవ్ర విఘాతం కలిగిందని, వ్యక్తిగత భద్రత కూడా పోయిందని తెలిపారు. ఆధారాలు, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వల్ల దశాబ్దాలు తరబడి సేకరించిన మావోయిస్టులు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్ళారు. 

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లకు రెడ్ కార్నర్ నోటీసులు

మరోవంక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి మాజీచీఫ్ ప్రభాకర్‌రావు,  శ్రవణ్‌కుమార్‌రావులకు హైద రాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా శ్రవణ్ కుమార్ లండన్‌లో ఉన్నారు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే వీరు విదేశాలకు వెళ్లినట్లు ఆ రోపణలు వచ్చాయి.
 
వీరిని అరెస్ట్ చేసేందుకు ప్ర యత్నిస్తున్న పోలీసులు తొలుత లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా రెడ్ కార్నర్ నోటీ సులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ప్రక్రియలో భాగంగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ సైతం దాఖలు చేశారు. ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో వీరిని అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉంటుంది.