
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న వేళ ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రోడ్లు, రేషన్ బియ్యం, గ్రామాలకు మంచి నీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారని చెప్పారు.
మోదీ ప్రమాణస్వీకారం పూర్తి కాగానే మేళతాళాలతో కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారని తెలిపారు. రాష్ట్రంలోనూ మండల కేంద్రాల్లో ఆ కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత పుంజుకుంటుందని, ప్రజలకు సమర్థవంతగా సుపరిపాలన అందిస్తామని తెలిపారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత