పోలీసుల డేటా చోరికి కేసులో హ్యాకర్‌ అరెస్ట్

రాష్ట్ర పోలీస్‌శాఖ సైబర్‌ సెక్యూరిటీ- బ్యూరో హాక్‌ఐ, టీఎస్‌ కాప్‌ అప్లికేషన్‌ డేటా చోరీ కేసులో హ్యాకర్‌ ఢిల్లికి చెందిన హ్యాకర్‌ జితిన్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తెలంగాణ డీజీపీ రవి గుప్త ప్రకటించారు. టీఎస్‌ కాప్‌,ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవలకు సంబంధించి యాప్‌లు హ్యాక్‌కు గురైన వెంటనే కేసు నమోదు చేశామని తెలిపారు.

ఈక్రమంలో ఈ కేసు దర్యాప్తు భాగంగా టీజీసీఎస్‌బీ అధికారులు ఢిల్లికి వెళ్లి చోరీ చేసిన డేటాను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టిన నిందితుడు జితిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్ట్‌ చేయడం జరిగిందని చెప్పారు. గ్రేటర్‌ నోయిడాలో నిందితుడిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు వివరించారు.

హ్యాకర్‌ చోరి చేసిన వివరాలను డేటాబ్రీచ్‌ఫోరంలో 150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని, డేటా కొనుగోలుదారులు తనను సంప్రదించడానికి టెలిగ్రామ్‌ ఐడీలు అందించాడని తెలిపారు. యూపీకి చెందిన జితిన్‌ ఢిల్లిలోని గ్రేటర్‌ నోయిడా కేంద్రంగా హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నాడని చెప్పారు.  నిందితుడు తన ఆచూకీ కనుగొనకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని అయితే సాంకేతిక పరిజ్ఞనంతో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన హ్యాకర్‌ జితిన్‌పై గతంలోనూ సైబర్‌ కేసులున్నాయని, ఢిల్లిలోని ద్వారక పోలీస్‌స్టేషన్‌లో 2023లో సైబర్‌ నేరాలకు పాల్పడ్డారని వివరించారు.  గత ఏడాది నిందితుడు ఆధార్‌ కార్డుల డేటాను, ఇతర ఏజెన్సీల సమాచారాన్ని చోరీ చేశాడన్నారు. ఈ కేసులో నిందితునికి సహకరించిన మరికొందరి పాత్రపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.

అయితే నిందితుడు చోరీ చేసిన డేటా ఏమాత్రం బయటకు వెళ్లలేదని, తెలంగాణ పోలీసు శాఖ యాప్‌లలో బలహీనమైన పాస్‌వర్డ్‌లు ఉంచిన కారణంగా డేటా చోరీ అయినట్లు తేలిందన్నారు. టీఎస్‌కాప్‌లో కీలకమైన సమాచారమేమీ లేదని, అత్యంత కీలకమైన డేటా హ్యాక్‌కు గురైందనని మీడియాలో ప్రచారం చేయడం తగదని తెలిపారు.

ఇకముందు పోలీస్‌ యాప్‌లకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కేసును సకాలంలో ఛేదించిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌, ఎస్పీలు భాస్కరన్‌, విశ్వజిత్‌ కంపాటి, డీఎస్‌పీలు కెవిఎం ప్రసాద్‌, ఎ.సంపత్‌,ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌ రెడ్డి, కానిస్టేబుల్‌ సురేష్‌లను డిజిపి అభినందించారు.