పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం

పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం

నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై గెలిచారు.  రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు విజయాన్ని శుక్రవారం సాయంత్రం ధ్రువీకరించారు.   మూడు రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొద‌టి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థితో పాటు 43 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేట్ కావడంతో తీన్మార్ మలనాన్న విజయం సాధించారు.

గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.   మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది.

రెండో ప్రధాన్యత ఓటులో మల్లన్నకు రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ముందు నుంచీ తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటన చేశారు.

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్‌ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌పై తప్పుల తడకగా జరుగుతుందంటూ వస్తున్న ఆరోపణలపై రిటర్నింగ్ అధికారిని హరిచందన స్పందిస్తూ కౌంటింగ్‌ తీరుపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు చెప్పారు. ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేస్తారని ఆమె సూచించారు.

తీన్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న ఈసారి విజయం సాధించారు.

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1983 జనవరి 17న ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపురం గ్రామంలో జన్మించారు. ఓ సాధారణ విలేకరిగా ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పాపులర్ అయిన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ పేరే ఇప్పుడాయన ఇంటిపేరు అయింది. తీన్మార్ మల్లన్నగానే చాలా మందికి పరిచయం. 

ఆ తర్వాత ఆయనే సొంతంగా ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. ప్రధానంగా తెలంగాణలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాలపై ఆయన పోరాటం చేశారు.ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న తీన్మార్‌ మల్లన్నపై అనేక మార్లు దాడులు సైతం జరిగాయి. 

పోలీసుల వేధింపులు, అరెస్టులు తప్పలేదు. పలు కేసుల కారణంగా ఆయన కొద్దిరోజులు జైలు జీవితం సైతం గడిపారు. గతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తీన్మార్‌ మల్లన్న వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీ మద్దతుతోనే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.