
వరంగల్, ఖమ్మం, నల్లగొం డ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠను రేపుతోంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్య హోరాహో రీ పోరు జరగడం, మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలక పోవడం, గెలుపు కోటాకు చాలా దూరంలో ఉండటంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికావడం ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. తొలి ప్రాధాన్యతలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,565 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత నాలుగు రౌండ్లు ముగిసేసరికి తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) 1,22,813, ఏనుగుల రాకేష్రెడ్డి (బిఆర్ఎస్) 1,04,248, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (బిజెపి) 43,313, పాలకూరి అశోక్గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి) 29,697 ఓట్లు వచ్చాయి.
అయితే 27,978 ఓట్లు చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. పెద్దసంఖ్యలో ఓట్లు చెల్లకపోవడంతో ప్రధానమైన అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 50 శాతం ఫ్లస్ ఒక్క ఓటు రావల్సి ఉంది. మొదటి ప్రాధాన్యతలో గెలవాలంటే 1,55,095 ఓట్లు రావాలి. గెలుపు కోటా పూర్తికి తీన్మార్ మల్లన్నకు ఇంకా 32,282 ఓట్ల దూరంలో ఉన్నారు.
ఎలిమినేషన్ రౌండ్ను తక్కువ ఓట్లు వచ్చిన దగ్గర నుండి ప్రారంభిస్తారు. అందరికీ తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేషన్ త్వరగా పూర్తికానుంది. కానీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్గౌడ్కు 29,697 ఓట్లు వచ్చాయి. ఆయన దగ్గరకు ఎలిమినేషన్ వస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి పడుతుందోనని తీన్మార్ మల్లన్న, ఏనుగుల రాకేష్రెడ్డిలలో టెన్షన్ మొదలైంది.
అశోక్గౌడ్, ప్రేమేందర్రెడ్డి (బిజెపి)లకు పడిన ఓట్లు ఎలిమినేషన్ చేస్తే ఎవరికి ఎక్కువ వస్తాయో వారే గెలిచే అవకాశముంది. ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టడం, అదంతా పూర్తయ్యే వరకు శుక్రవారం రాత్రి వరకు పట్టనుంది.
మరోవంక, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎంఎల్సి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి గురువారం సిఇఒ వికాస్ రాజ్ కు పిర్యాదు చేశారు. పట్టాభద్రుల ఎంఎల్సి ఉప ఎన్నిక లెక్కింపులో బిఆర్ఎస్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
మూడవ రౌండ్లో 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బిఆర్ఎస్ వచ్చిందని, రాకేశ్ రెడ్డికి వచ్చిన ఆధిక్యాన్ని లిస్టులో తీన్మార్ మల్లన్నకు చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!