తెలంగాణలో భవిష్యత్ భారతీయ జనతాపార్టీదే

తెలంగాణలో భవిష్యత్ భారతీయ జనతాపార్టీదే
తెలంగాణ ప్ర‌జ‌లే కాదు, యావ‌త్ దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నారని లోక‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు రుజువు చేశాయని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం ప్రకటించారు. బిజెపి విజ‌యం మోదీ విజ‌యం, ఇది మోదీ స‌మ‌ర్ధ నాయ‌క‌త్వానికి ప‌డిన ఓట్లని తెలిపారు.

తెలంగాణ‌లో బిజెపి పెరుగుద‌ల స్ప‌ష్టంగా క‌నిపిస్తోందని చెబుతూ 2014లో ఒక ఎంపీ సీటు, 2019లో నాలుగు సీట్లు 2024 ఇపుడు 8 సీట్లు గెలిచామంటే ప్ర‌ధాని మోదీ చ‌రిష్మా వ‌ల్లేనని ఆయన పేర్కొన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బిజెపి మ‌ళ్లీ గెలిస్తే రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తుంద‌ని, కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన‌ట్లు వీడియా మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు తిప్పికొడుతూ ఆ పార్టీకి బుద్ధిచెప్పారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్ని జిమ్మిక్కులు చేసినా  వారి చెప్పిన సీట్లు కంటే తక్కువే గెలిచారని ధ్వజమెత్తారు.స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెడమ్ అని అన్నారని, 14 సీట్లలో గెలుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు 8 సీట్లకే వారిని ప్రజలు పరిమితం చేశారని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆరు నెలల్లోనే ప్రజలకు విశ్వాసం పోయిందని తేలిందని ఆయన విమర్శించారు.

నిజంగా ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెడమేనని తెలిపారు. 16 సీట్ల‌లో కాంగ్రెస్ దాదాపు వెయ్యి కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ప్ప‌టికీ భంగ‌పాటు త‌ప్ప‌లేదని పేర్కొంటూ ఈ ఫలితాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెసుకు కౌంట్ డౌన్ మొద‌లైంద‌ని స్ప‌ష్ట‌మౌతోందని ఏలేటి తెలిపారు. ఇక  ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయాలన్న ఆకాంక్షతో బీజేపీని ఆశీర్వాదించినందుకు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ణతలు  తెలిపారు. ఈ ఎన్నికల్లో 35 శాతం ఓటు బ్యాంకు అందించిన రాష్ట్ర ప్రజలందరికీ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.